చంద్రబాబు మరో అధికారిక సమీక్ష..ఎన్నికల కమిషన్ గుస్సా! కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందంటూ నోటీసులు
అమరావతి: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు తనకు అలవాటైన రీతిలో రోజుకో సమీక్షలు చేస్తున్నారు. రెండురోజుల కిందటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై వర్చువల్ రివ్యూ నిర్వహించిన ఆయన గురువారం తాజాగా మరోమారు అధికారిక సమీక్ష నిర్వహించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో కొనసాగుతున్న నిర్మాణ పనులపై చంద్రబాబు ఈ మధ్యాహ్నం అధికారులతో సమీక్షా సమావేశాన్ని చేపట్టారు. మున్సిపల్ శాఖ మంత్రి పీ నారాయణ సహా పలువురు సీఆర్డీఏ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఆపద్ధర్మ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అధికారికంగా సమీక్షా సమావేశాలను నిర్వహించడాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ తప్పు పట్టింది. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో..చంద్రబాబుకు నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఈ నెల 11వ తేదీన తొలిదశలో పోలింగ్ ముగిసిన తరువాత చంద్రబాబు క్రమంగా పాలన వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన కర్ణాటక, తమిళనాడుల్లో మిత్రపక్షాల ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. అనంతరం అధికారికంగా సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బుధవారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు, సీఆర్డీఏ పై సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జులైలో పోలవరం నుంచి నీటిని విడుదల చెయ్యాలని అధికారులను ఆదేశించారు. దీనితోపాటు- గురువారం రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న నిర్మాణ, అభివృద్ధి పనులనూ సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశాల తతంగంపై ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది..కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఓ నివేదిక అందజేశారు. చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశాల మినిట్స్ ను కూడా ఆయన దీనికి జత చేసినట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో ఎలాంటి అధికారిక సమీక్షా సమావేశాలను చేపట్టకూడదని ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలన్నీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందంటూ ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా.. చంద్రబాబుకు నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తోంది. సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించకూడదని ఆదేశిస్తూ, అధికారులందరికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రతులను అందజేసింది. ఎన్నికల ఫలితాలకు ఇంకా నెలరోజులపైనే సమయం ఉందని, అప్పటివరకు పాలన పక్కన పెట్టి ఖాళీగా కూర్చోనని చంద్రబాబు నాయుడు ఇదివరకే ప్రకటించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం-రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపించడం తనకు ముఖ్యమని చెప్పుకొచ్చారు.