ప్రమాదంలో పడ్డ ప్రజాస్వామ్యం: అతి పెద్ద కుంభకోణాలు..అస్సలు బాధ్యత లేని మోడీ
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్గా చేసుకున్నారు. అనేక విషయాలను ప్రస్తావిస్తూ, మోడీపై విమర్శలతో చెలరేగిపోయారు. కనీస బాధ్యత లేని ప్రధానిగా మోడీని అభివర్ణించారు. రాజ్యాంగ వ్యవస్థను సర్వనాశనం చేశారని విరుచుకు పడ్డారు. నరేంద్రమోడీ అయిదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, వ్యవస్థల మధ్య అంత:కలహాలను సృష్టించి, చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.
ఏటీఎంలను దిష్టిబొమ్మలుగా మార్చారు:
నరేంద్ర మోడీ హయాం మొత్తం కుంభకోణాల మయమైందని చంద్రబాబు విమర్శించారు. పెద్ద నోట్లను రద్దు చేసి బ్యాంకింగ్ వ్యవస్థను నాశనం చేశారని అన్నారు. బ్యాంకుల పట్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయేలా చేశారని చెప్పారు. ఆర్థికమాంద్యం పరిస్థితుల్లోనూ బ్యాంకింగ్ వ్యవస్థ మన దేశానికి వెన్నెముకలా నిలిచిందని, అలాంటి బ్యాంకులను మోడీ నాశనం చేశారని చెప్పారు. బ్యాంకులపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బకొట్టారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు అతి పెద్ద కుంభకోణమని చంద్రబాబు పేర్కొన్నారు. పెద్ద నోట్లను రద్దు చేయడానికి గల కారణాలపై ఆరా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
జీఎస్టీ మరో వైఫల్యం..
మోడీ హయాంలో పన్ను వసూళ్లు కుప్పకూలాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా వస్తు, సేవా పన్ను విధానాన్ని అమలు చేశారని, దీనివల్ల ప్రజలు, వ్యాపారులు అన్ని విధాలుగా నష్టపోయారని చెప్పారు. జీఎస్టీ ఎవరికీ మేలు కలగటం లేదని, ఏ వర్గానికి ఉపయోగకరంగా లేదని అన్నారు. జీఎస్టీని సమర్థవంతంగా అమలు చేయకపోవడం వల్ల దేశం ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని విమర్శించారు. దీని ప్రభావం వల్ల అంతర్జాతీయంగా రూపాయి విలువ దారుణంగా క్షీణించిందని అన్నారు. మోడీకి గానీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి గానీ ఆర్థిక వ్యవస్థపై ఏ మాత్రం అవగాహన లేదని, కనీస పట్టు లేదని ఆరోపించారు.
ఇంత బాధ్యతారాహిత్యమా?
72 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో నరేంద్ర మోడీ వంటి బాధ్యతారాహిత్య ప్రధానిని ఎప్పుడూ, ఎవ్వరూ చూడలేదని చంద్రబాబు ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కనీస జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో మొదటిసారి నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ పరిధుల నుంచి బయటికొచ్చి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ దేశంలో నెలకొన లేదని అన్నారు. మోడీ హయాంలోనే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని అన్నారు. కోట్లాదిమంది భారతీయులకు ప్రాతినిథ్యం వహిస్తోన్న మోడీలో హూందాతనం అనేదే లేదని చెప్పారు.
రక్షణ శాఖలో ఫైళ్లు మాయం వెనుక..
దేశ చరిత్రలో తొలిసారిగా రక్షణ శాఖ కార్యాలయంలో కీలక ఫైళ్లు మాయం కావడం వెనుక ఎవరి హస్తం ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లకు సంబంధించిన పత్రాలు, దేశ భద్రతకు సంబంధించిన ఫైళ్లు మాయం కావడం ఎలాంటి సంకేతాలను ఇస్తోందని నిలదీశారు. 70 ఏళ్లలో దేశం చూసిన ప్రధానమంత్రుల్లో అస్సలు జవాబుదారితనం లేని ప్రధానినే అని పత్రికారంగం కూడా కోడై కూస్తోందని అన్నారు. తన అయిదేళ్ల పరిపాలనలో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టని ప్రధాని మోడీ తప్ప మరెవరూ లేరని చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థల మధ్య అంత:కలహాలు రేపిన పాలన కూడా మోడీదేనని విమర్శించారు.
ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీల ప్రయోగం
తన రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవానికి నరేంద్రమోడీ.. రాజ్యాంగ వ్యవస్థలను వినియోగించుకున్నారని ధ్వజమెత్తారు చంద్రబాబు. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను వంటి శాఖలను తన రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించారని, ఫలితంగా ఆయా రాజ్యాంగ వ్యవస్థలు కూడా ప్రజల్లో తమ విశ్వాసాన్ని కోల్పోయాయని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘంలోనూ తన మనుషులను జొప్పించారని ఆరోపించారు. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలన్నీ మోడీ హయాంలో చోటు చేసుకున్నాయని, ఈ నెల 23వ తేదీ అనంతరం- ఇక ఆయన ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాల్సి ఉంటుందని చంద్రబాబు అన్నారు. మోడీ తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించే అవకాశాలు లేకపోలేదని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు మంత్రివర్గ భేటీ ప్రస్తావన వెనుక అసలు విషయం అదేనా?