వస్తే ఏపీకే వస్తానని 'చైనా' గవర్నర్, బాబు హ్యాపీ: ఢిల్లీకి మెట్రో అప్పగింత
బీజింగ్/హైదరాబాద్: తాను భారత దేశంలో పర్యటిస్తే తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తానని సిచువాన్ ప్రావిన్స్ గవర్నర్ హుయ్ హంగ్ బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చెప్పారు. చంద్రబాబు గవర్నర్తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా బాబు ఆయనను భారత పర్యటనకు ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజులు ఉండాలని కోరారు. దీనిపై హుయ్ హంగ్ స్పందించారు. తాను భారత పర్యటనకు వస్తే తొలుత ఏపీలోకే వస్తానన్నారు.
చంద్రబాబు గౌరవార్థం సిచువాన్ ప్రావిన్స్ గవర్నర్ హుయ్ హంగ్ విందు ఇచ్చారు. గవర్నర్ హుయ్ హంగ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని యాభై శాతం ల్యాప్టాప్లు తమ ప్రావిన్స్వేనని చంద్రబాబుతో చెప్పారు. కాగా, చైనాలోని పరిశుభ్రమైన రహదారులను చూసి చంద్రబాబు బృందం ముచ్చటపడింది.
చైనాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాలుగో రోజు బిజీబిజీగా గడిపారు. అంతకుముందు బీజింగులో చైనా మంత్రులు, కమ్యూనిస్టు నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభవృద్ధికి సహరించాలని కోరారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న మౌలిక వసతులను ఆయన వారికి వివరించారు. అనంతరం బీజీంగ్ నుంచి చంద్రబాబు బృందం చెంగ్డోకు చేరుకున్నారు.
ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్కు అప్పగింత
ఈ నెల 24వ తేదీన మెట్రో రైలు డీపీఆర్ను మెట్రో శ్రీధరన్ ఏపీ సీఎం చంద్రబాబుకు ఇవ్వనున్నారు. విశాఖలో 39 కిలోమీటర్లు, విజయవాడలో 25 కిలోమీటర్ల మెట్రో రైలును నిర్మించనున్నారు. మెట్రో రైలు బాధ్యతలను ఏపీ ప్రభుత్వం ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్కు అప్పగిస్తోంది. కిలోమీటరుకు రూ.250 కోట్ల చొప్పున విజయవాడకు రూ.6,250 కోట్లు, విశాఖకు రూ.9,750 కోట్లు అవుతాయని అంచనా వేశారు.