కార్యకర్తల మధ్య సమన్వయం పెరగాలి: బాబు, ముందు వరుసలో లోకేశ్
అమరావతి: విజయవాడలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్ధాయి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి, నేతల మధ్య సమన్యయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
పార్టీలోకి కొంత మంది నేతలు వస్తున్నారని, మంచివాళ్లకు ఆహ్వానం పలుకుదామని తెలిపారు. పార్టీ అంటే కుటుంబం వంటిదని, కుటుంబంలో అందరికీ ఆలోచనలు వస్తుంటాయని, వాటిని అందరం పంచుకుందామని సూచించారు.
పార్టీలో కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, పూర్థి స్థాయి జిల్లా కమిటీలు వేయాల్సి ఉందని తెలిపారు. నాయకులు ప్రజలతో సంబంధాలు మెరుగుపర్చుకోవాలని నేతలకు సూచించారు. కార్యకర్తలకు ఆర్థిక, రాజకీయ, సామాజికంగా గుర్తింపు ఇవ్వాలన్నారు.
రైతులకిచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ నిర్మాణం, సంస్థాగత నిర్ణయాలు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు. అలాగే పార్టీ కోసం త్యాగాలు చేసిన కుటుంబాలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్నికల్లో ఓడిన నాయకులను భుజం తట్టి ప్రోత్సహించాలని నాయకులకు, కార్యకర్తలను కోరారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.
ఈ కార్యక్రమానికి ఏపీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు జడ్పీ ఛైర్మన్లు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లతోపాటు నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు.