చంద్రబాబు కేరాఫ్ 10 జనపథ్: సోనియాతో ముగిసిన భేటీ: వైఎస్ జగన్, కేసీఆర్ అంశం ప్రస్తావన?
న్యూఢిల్లీ: ఈ నెల 23వ తేదీన ఫలితాలు వెలువడిన అనంతరం చోటు చేసుకునే రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కాంగ్రెస్ సారథ్యం వహిస్తోన్న యూపీఏ మిత్రపక్షాలతో ఎడతెగని చర్చలు నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగా- తాజాగా ఆయన యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సోనియాగాంధీ నివాసం 10 జనపథ్లో సుమారు 40 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. ముఖాముఖి భేటీ నిర్వహించారు.
కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీలతో సమదూరాన్ని పాటిస్తోన్న ప్రాంతీయ పార్టీల అంశం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి నేతృత్వంలోని టీఆర్ఎస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల వైఖరి ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ గురించి సోనియాగాంధీ ప్రస్తావించగా.. దానిపై చర్చించడానికి చంద్రబాబు నాయుడు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అదే సమయంలో- కేసీఆర్ విషయాన్ని సోనియా ప్రస్తావించినట్లు చెబుతున్నారు. కేసీఆర్ను కలుపుకొనిపోవడానికి తనకు అభ్యంతరం లేదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం.
ఈ నెల 23వ తేదీన ఫలితాల అనంతరం- యూపీఏ నిర్వహించబోయే విపక్ష పార్టీల సమావేశానికి కేసీఆర్, వైఎస్ జగన్ సహా నవీన్ పట్నాయక్లకు ఆహ్వానం పంపించినప్పటికీ.. వారి నుంచి పెద్దగా స్పందన రాలేదని, ఇది కూడా సోనియాగాంధీ-చంద్రబాబు మధ్య ప్రస్తావించినట్లు చెబుతున్నారు. కాగా- బహుజన్ సమాజ్వాది పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో తాను నిర్వహించిన సమావేశ వివరాలను సోనియాకు వివరించారు.