మే 23 ఎఫెక్ట్: మహానాడుపై మల్లగుల్లాలు: ముఖ్యులతో చంద్రబాబు భేటీ
అమరావతి: అధికారంలో ఉన్నా, లేకపోయినా ఏటేటా తెలుగుదేశం మూడురోజుల పాటు పార్టీపరంగా నిర్వహించే అతి పెద్ద ఉత్సవం మహానాడు. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మేలో మూడు నెలల పాటు మహానాడును నిర్వహించుకోవడం తెలుగుదేశం ఆనవాయితీ. ఏటా మే 27, 28, 29 తేదీల్లో మహానాడును నిర్వహిస్తారు. పసుపు పండగ పేరుతో పార్టీ అభిమానులు, కార్యకర్తలు వందలాది మంది మహానాడుకు హాజరువుతుంటారు.
2014లో అధికారంలోకి వచ్చిన తరువాత
2014లో తెలుగుదేశం పార్టీ మూడోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత తొలి రెండు సంవత్సరాలు హైదరాబాద్ శివార్లలోని గండిపేట్లో నిర్వహించారు. పరిపాలనను ఆంధ్రప్రదేశ్కు మార్చిన తరువాత వేర్వేరు చోట్ల నిర్వహించారు. 2016లో తిరుపతి, 2017లో విశాఖపట్నం, 2018లో విజయవాడలో మహానాడు ఉత్సవాలను నిర్వహించాయి. ఈ సారి దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. మహానాడును నిర్వహించాలా? లేక వాయిదా వేయాలా? అని తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం యోచిస్తోంది. దీనిపై కొద్దిరోజులుగా మీడియాలో విభిన్న కథనాలు వస్తున్నాయి. మహానాడును వాయిదా వేయొచ్చని, లేదంటే మొత్తానికే నిర్వహించకపోవచ్చంటూ వేర్వేరు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఒకవంక మహానాడు గడువు ముంచుకొస్తోంది. మరోవంక ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠతకు గురి చేస్తున్నాయి. ఈ సారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఎంత మాత్రం కూడా లేదంటూ సర్వేలన్నీ స్పష్టం చేశాయి. పోలింగ్ సరళి కూడా దీనికి అనుగుణంగానే ఉంది. పోలింగ్ సరళిని క్షుణ్నంగా పరిశీలించిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా గెలుపోటములపై ఓ అంచనాకు వచ్చేసింది. అధికారం అందకపోవచ్చని, బలమైన ప్రతిపక్షంగా నిలుస్తామనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమౌతోంది. ఈ పరిస్థితుల్లో మహానాడును నిర్వహించాలా? వద్దా? అనే చర్చ పార్టీలో కొనసాగుతోంది.
మహానాడు నిర్వహణపై ముఖ్యులతో చంద్రబాబు భేటీ..
ఈ విషయంపై ఓ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులతో క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మంత్రులు నారా లోకేశ్, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ భేటీలో పాల్గొన్నారు. మహానాడును మూడురోజుల పాటు నిర్వహించాలా? లేక ఒకరోజుకే పరిమతం చేయాలా? అనే అంశంపై చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఫైనాన్షియర్ల సమస్య ఉందా?
మహానాడు నిర్వహణకు కోట్ల రూపాయల మేర ఖర్చవుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచీ కార్యకర్తలను తరలించడం, వారికి భోజన ఏర్పాట్లు, నివాస వసతి వంటి సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత పార్టీ యంత్రాంగంపై ఉంది. టీడీపీలో ఆర్థికంగా బలంగా ఉన్న కొందరు నాయకులు దీనికయ్యే ఖర్చను భరిస్తుంటారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, మాగంటి బాబు, గంటా శ్రీనివాసరావు, నారాయణ, డీకే సత్యప్రభ వంటి నాయకులు రోజుల వారీగా మహానాడు ఖర్చును భరిస్తుంటారు. ఈ సారి ఎన్నికల్లో భారీగా ఖర్చు చేశామని, గెలుస్తామో, లేదో అనుమానాలు ఉన్నాయని ఆయా నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ మహానాడు ఖర్చును భరిచాల్సి రావడం తలకు మించిన పనే అవుతుందనే వారు చెబుతున్నారు.