'కడపపై రంగంలోకి చంద్రబాబు, ఇక జగన్కు నిద్రపట్టదు': అధినేత క్లాస్తో తగ్గిన నేతలు
కడప: వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత వైయస్ జగన్ సొంత నియోజకవర్గం కడపపై దృష్టి సారించిన టీడీపీకి జిల్లాలో నేతల మధ్య విభేదాలు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. దీంతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి నేతలకు క్లాస్ పీకారు. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి, రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ల మధ్య విభేదాలపై ఆయన దృష్టి సారించారు.
సీఎం రమేష్పై వరదరాజులురెడ్డి తీవ్రవ్యాఖ్యలు: కడప గొడవపై చంద్రబాబు సీరియస్
కడప జిల్లా నేతలతో భేటీపై పార్టీ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతంపై చర్చించామని చెప్పారు. ఏ మండలం, ఏ నియోజకవర్గానికి వెళ్లినా అభివృద్ధి కనిపిస్తోందన్నారు. నేతల మధ్య అపార్థాలు ఉన్న మాట వాస్తవమేనని, పార్టీలోని సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. నేతల మధ్య విభేదాలతో కడప అభివృద్ధికి ఇబ్బంది రాకూడదని నేతలు భావిస్తున్నారన్నారు. కలిసి పని చేస్తామని వారంతా చెప్పారన్నారు.
రంగంలోకి చంద్రబాబు, ఇక వైసీపీకి నిద్రపట్టదు
కడప జిల్లా నేతలు అందరూ కూడా ఏకతాటి పైకి వచ్చారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మేమంతా కలిశామని, ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి (కడపపై టీడీపీ ప్రత్యేక దృష్టి సారించినందున) నిద్రపట్టదని చెప్పారు. మరోసారి ఇలా జరగడానికి వీల్లేదని (పార్టీలో నేతల మధ్య విభేదాలు), పత్రికలకు ఎక్కవద్దని ముఖ్యమంత్రి హెచ్చరించినట్టు జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు.
సొంత పార్టీ నేతలపై విమర్శలు
జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధించాయన్నారు. సొంత పార్టీ నేతలపై ఇలా విమర్శలు చేయడం ఇదే తొలిసారి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషికి తమ సహకారం ఉంటుందని తెలిపారు. జిల్లా నేతల మధ్య అపార్థాలున్నా తమదంతా ఒకే కుటుంబం అన్నారు. జిల్లాలో పదికి పది శాసనసభ స్థానాల్లో గెలిస్తేనే చంద్రబాబు కల నిజమవుతుందని, దానికి కృషి చేస్తామని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కడప స్టీల్ప్లాంట్ కోసం నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించామని, జిల్లా నేతలతో మాట్లాడి తేదీ ఖరారు చేస్తామని సీఎం రమేష్ తెలిపారు.
చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
కాగా, క్రమశిక్షణ తప్పితే వేటు తప్పదని పార్టీ నేతలను చంద్రబాబు కడప జిల్లా నేతలను సోమవారం హెచ్చరించారు. మీకు పదవులిచ్చానని, ఎంతో కష్టపడి కడప జిల్లాకు నీళ్లిచ్చానని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, అవన్నీ సానుకూలంగా మలుచుకుని పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి మీలో మీరు కొట్టుకుంటే ఎలాగని, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతారా అని, మీడియాకు ఎక్కుతారా, పార్టీని దెబ్బతీస్తారా, ఇలాంటి వాటిని సహించనని, మీ గొడవల వల్ల పార్టీ మునిగే పరిస్థితి వస్తే ఎవర్ని వదులుకోవడానికైనా సిద్ధమని, కఠిన చర్యలకు వెనుకాడనని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
బీటెక్ రవిని గెలిపించారుగా
కడప జిల్లాలో నాయకుల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో ఉండవల్లిలోని ప్రజాదర్బారు హాలులో కడప పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులతో సీఎం అయిదున్నర గంటలపాటు భేటీ అయ్యారు. మీలో ఒకరు మంత్రి, మరొకరు ఎంపీ, మరొకరు జిల్లా అధ్యక్షులు, మరొకరు సీనియర్ నేత.. మీరు కలిసి ఉండకండా రోడ్డెక్కుతారా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ సమష్టిగా పని చేసి బీటెక్ రవిని గెలిపించారని, ఆ స్ఫూర్తి ఇప్పుడేమైందని అసహనం వ్యక్తం చేశారు.
కడపలో రెండు ఎంపీ, పది ఎమ్మెల్యే స్థానాలపై బాబు దృష్టి
మంగళవారం జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాలపై సమీక్షఇంచారు. సోమవారం సీఎం రమేష్, వరదరాజుల రెడ్డి మధ్య విభేదాలు, జమ్మలమడుగులో రామసుబ్బా రెడ్డికి, ఆదినారాయణ రెడ్డికి మధ్య ఉన్న గొడవలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. కడప జిల్లాలో పది శాసనసభ, రెండు ఎంపీ సీట్లలో గెలిచి తీరాలన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పతనం మొదలైందని చంద్రబాబు అన్నారు. రాజకీయాల్లో ఇష్టానుసారం చేస్తే బీజేపీకి పట్టిన గతే పడుతుందన్నారు.