హైదరాబాద్ను నేనే అభివృద్ధి చేశా, ఆటో డ్రైవర్ను అడిగినా చెప్తాడు: బాబు
చరిత్రను తిరగారాసే సత్తా తమకు ఉందని, 2019లొను తానే సీఎం అని, ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
విజయవాడ: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సభలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, గతంలో తాను హైదరాబాద్ లో చేసిన అభివృద్ది గురించి సభలో ఆయన ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తానే ఎక్కువ కాలం, సీఎంగా, ప్రతిపక్ష నేతగా పనిచేశానని గుర్తుచేశారు.
ఆ సమయంలో హైదరాబాద్ నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కు ఇంత పేరు రావడం వెనుక కారణమెవరని ఆటో డ్రైవర్ నుంచి రోజూ కూలీ వరకు ఎవరిని అడిగినా.. అంతా తన పేరే చెబుతారని పేర్కొన్నారు. 2004లో తాను ప్రవేశపెట్టిన పలు ఆర్థిక విధానాల వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు.
చెప్పిందే జరిగింది:
ఉమ్మడి రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్న సమయంలో విపక్ష నేత జనార్దన్ రెడ్డి కూడా జగన్ లాగే మాట్లాడారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లోపు నువ్వు గెలవవని ఆ సందర్బంగా జనార్దన్ రెడ్డిని తాను హెచ్చరించానని, అందు తగ్గట్లే ఆయన ఓడిపోయారని అన్నారు.
హైకమాండ్ లేకుండా మెప్పు పొందింది ఇద్దరే:
రాష్ట్రంలో హైకమాండ్ లేకుండా ప్రజల మెప్పు పొందిన వ్యక్తులు ఇద్దరేనని, ఒకరు ఎన్టీఆర్ అయితే రెండోది తానే అని చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా సోనియా, ఇందిరాగాంధీల ఫోటోలు పెట్టుకునే ఓట్లు అడిగారని గుర్తుచేశారు. తాను అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ది చేయగల నమ్మకంతో ప్రజలు తనను ఆశీర్వదించారని, రానున్న రోజుల్లో అమరావతిని కూడా హైదరాబాద్ లా తయారుచేస్తానని చంద్రబాబు హామి ఇచ్చారు.
2019లోను నేనే సీఎం.. అనుమానాలు వద్దు:
చరిత్రను తిరగారాసే సత్తా తమకు ఉందని, 2019లొను తానే సీఎం అని, ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో ఐటీని ప్రోత్సహించిన మొదటి వ్యక్తిని తానే అని, దాని ఫలితాలు ఇప్పుడు తెలుగుజాతి అనుభవిస్తోందని అన్నారు. 2025నాటికి దేశంలో ఏపీ టాప్-3 లో ఉంటుందని, 2050నాటికి అగ్రస్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
8శ్వేత ప్రతాలు:
విద్య, ఆరోగ్య, పారిశ్రామిక సేవ, 24గం. విద్యుత్, పౌర సరఫరాలు, ఇన్ఫర్మేషన్, తదితర రంగాల అభివృద్ది కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఇప్పటికీ 8శ్వేత పత్రాలు విడుదల చేశామని, అవినీతికి ఆస్కారం ఇవ్వబోమని తెలిపారు.