మీ ఆటలు నా దగ్గర సాగవు...వైసీపీకి చంద్రబాబు వార్నింగ్;తిత్లీ కొత్త అనుభవాన్ని నేర్పింది
శ్రీకాకుళం:కోడి కత్తి వ్యవహారంలో ఢిల్లీలో నానా హడావుడి చేశారని ప్రతిపక్ష పార్టీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రకరకాల కుట్రలకు పాల్పడుతున్న వైసిపి ఆటలు తన దగ్గర సాగవని ఆయన హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షనేత జగన్ పక్క జిల్లాలో ఉండి కూడా తిత్లీ తుఫాన్ బాధితులను పరామర్శించలేదని ధ్వజమెత్తారు. అయితే తిత్లీ తుపాను తనకు కొత్త అనుభవాన్ని నేర్పిందని చంద్రబాబు తెలిపారు. లోపాలను సరిదిద్దుకొని భవిష్యత్లో సమర్థవంతంగా పనిచేస్తామని సిఎం చంద్రబాబు చెప్పారు.
శ్రీకాకుళంలో...బహిరంగ సభ
శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, నీచ రాజకీయాలకు పాల్పడ్డారని చంద్రబాబు దుయ్యబట్టారు. మరోవైపు ఉద్దానంపై ప్రేమ ఉందని పదే పదే చెప్పే జనసేన అధినేత పవన్ కేంద్రానికి లేఖ ఎందుకు రాయలేదని చంద్రబాబు నిలదీశారు.
కొత్త అనుభవం...నేర్పింది
తిత్లీ తుపాను తనకు ఒక కొత్త అనుభవాన్ని నేర్పిందని...అలాగే ఉద్దాన ప్రజల్లో ఉక్కు సంకల్పాన్ని నింపిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక్కడి ప్రజలు ఏమాత్రం అధైర్యపడాల్సిన పనిలేదని, ఉద్దానానికి పూర్వవైభవం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. తిత్లీ తుపాను భయానకమైన వాతావరణాన్ని సృష్టించినా అధికారుల అప్రమత్తతతో ప్రాణనష్టం తగ్గించగలిగామని వివరించారు. కార్యకర్తల కంటే ఎక్కువగా అధికారులు సహాయ చర్యల్లో పాల్గొన్నారని అన్నారు. అలాగే తీత్లీ తుఫాన్ సహాయక చర్యల్లో మంత్రులు, అధికారుల పనితీరు అభినందనీయమని...వారు దసరా పండుగ తుపాను బాధితుల మధ్యే గడిపారని కొనియాడారు.
కేంద్రానికి...బాధ్యత లేదా?
తిత్లీ బాధితుల సాయం కావాలని ఢిల్లీ నేతలను ఈ నేతలు ఒక్క మాట అడగరు. కేంద్రానికి మానవత్వం లేదు, తుపాను బాధితులకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు. పార్టీ ఆఫీసు శంకుస్థాపన చేసేందుకు కేంద్రమంత్రి రాజ్నాథ్కు సమయం ఉంటుంది. కానీ కష్టాల్లో ఉన్న ప్రజలను చూసేందుకు ఉండదు. తిత్లీ బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా?...కేంద్ర ప్రభుత్వ తీరును దేశవ్యాప్తంగా తిరిగి ఎండగడతామని చంద్రబాబు హెచ్చరించారు.
అందుకే...కాంగ్రెస్ సహకారం
దేశంలో బిజెపి ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నాశనం చేసేసిందన్నారు. బీజేపీ అరాచక పాలనను అంతమొందించేందుకే కాంగ్రెస్ పార్టీ సహకారం కోరామని స్పష్టం చేశారు. అలాగే రాజకీయ పార్టీలన్నింటినీ ఏకతాటి పైకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా హక్కుల కోసం పోరాటం ఆగదని చంద్రబాబు పునరుద్ఘాటించారు.