తాతామనవడి లాహిరి లాహిరి: దేవాన్ష్తో చంద్రబాబు బోటు విహారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తన కుమారుడు నారా లోకేష్, మనవడు దేవాన్ష్తో కలిసి కృష్ణా నదిలో బోటు షికారు చేశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తన కుమారుడు నారా లోకేష్, మనవడు దేవాన్ష్తో కలిసి కృష్ణా నదిలో బోటు షికారు చేశారు. మంగళవారం సాయంత్రం బోటులో కృష్ణానదిపై వెళ్లి సరదాగా గడిపారు.
ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరి ప్రకాశం బ్యారేజీ, దుర్గా ఘాట్, పున్నమి, భవానీ ఘాట్ల మీదుగా ఇబ్రహీంపట్నం సమీపంలోని గుంటుపల్లి వరకు వెళ్లారు. మొదట ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వరకు వెళ్లాలనుకున్నా చీకటి పడుతుండటంతో వెనక్కి వచ్చేశారు.
పర్యాటక శాఖ, ప్రైవేటు సంస్థకు చెందిన ఆరు బోట్లలో నదిలో విహరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, దేవాన్ష్ పుష్కరిణి బోటులో ప్రయాణించగా, భద్రతా సిబ్బంది మిగిలిన పడవల్లో అనుసరించారు.
కృష్ణా నది ఘాట్లలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుగు ప్రయాణంలో భవానీ ద్వీపాన్ని తిలకిస్తూ ఇంటికి చేరారు. మంగళవారం మధ్యాహ్నం తిరుపతి నుంచి నేరుగా తన నివాసానికి చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఇతర కార్యక్రమాలేవీ పెట్టుకోకుండా కుటుంబంతో సరదాగా గడిపారు.