పవన్-జగన్లే చెప్పుకోవాల్సి ఉంటుంది, మోడీ మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి: అసెంబ్లీలో బాబు
అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను ప్రజలు సహా అందరూ నమ్మారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన బుధవారం ఏపీ అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు మోడీ ఇచ్చిన హామీలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభలో ప్రదర్శించారు.
అలాగే, మంగళవారం జరిగిన అఖిల పక్ష భేటీ వివరాలను సభ ముందు ఉంచారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. పార్టీలకు అతీతంగా కలిసి వస్తే ప్రత్యేక హోదా కోసం ఉద్యమిద్దామని అన్ని పార్టీలకు, ప్రజా సంఘాలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ, జనసేనలు ఎందుకు రాలేదో చెప్పాలని ప్రశ్నించారు.
కేంద్రం నమ్మించి మోసం, ఎవరికి చెప్పుకోవాలి
మరోసారి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కేంద్రం నమ్మించి మోసగించిందని, ఇలా చేస్తే ఎవరికి చెప్పుకోవాలన్నారు. విభజన చట్టంలోని అంశాలను, ప్రత్యేక హోదా హామీలను నెరవేర్చాలన్నారు. నాలుగేళ్ల క్రితం ఓ జాతీయ పార్టీ రోడ్డున పడేసిందని, ఇప్పుడు మరో జాతీయ పార్టీ అన్యాయం చేసిందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు.
అవిశ్వాసంపై గందరగోళం
కేంద్రం చేసిన అన్యాయానికి నిరసగా ఏప్రిల్ 6వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలన్నారు. అవిశ్వాసంపై కేంద్రం గందరగోళం సృష్టిస్తోందన్నారు. హామీలు అమలు చేయాలని తాము కోరుతున్నామని చెప్పారు. సమయాభావం వల్ల అన్ని సంఘాలను పిలవలేకపోయామని, మరోసారి అఖిలపక్షం నిర్వహిస్తామని చెప్పారు. హోదా విషయంలో కేంద్రం అన్యాయం చేసిందన్నారు.
ఆ మూడు పార్టీలు ఎందుకు రాలేదు
బీజేపీ, జనసేన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు అఖిల పక్ష సమావేశానికి ఎందుకు రాలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ మూడు పార్టీలు ఎందుకు రాలేదో, వారి మనసులో ఏముందో అన్నారు. వీరు తమను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. టీమిండియా అని మోడీ చెప్పారని, కాని అలా వ్యవహరించడం లేదన్నారు.
మళ్లీ పిలుస్తాం, రాకుంటే మీరే సమాధానం చెప్పుకోవాలి
కేంద్రం తీరు వల్ల ప్రజలు నిరాశ చెందారని చంద్రబాబు చెప్పారు. కేంద్రం తీరుకు నిరసనగా ఓ గంటసేపు ఎక్కువ పని చేస్తూ నిరసన చెబుతామన్నారు. పార్లమెంటులో మన ఎంపీలు పోరాడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. అఖిల పక్ష భేటీకి రానీ జనసేన, వైసీపీ, బీజేపీలను మరోసారి నిర్వహించే భేటీకి పిలుస్తామని చెప్పారు. తాము అందరి సహకారం తీసుకోవాలనేదే తమ ధ్యేయం అన్నారు. వారు సమావేశానికి రాకుంటే ప్రజలకు వారే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు.
కేంద్రానికి ఈ కక్ష ఎందుకు?
ఏపీ పైన కేంద్రానికి ఈ వివక్ష ఎందుకు అని, ఎందుకు ఈ కోపం అని చంద్రబాబు ప్రశ్నించారు. మనం చేసేది ధర్మపోరాటం అన్నారు. కేంద్రం కావాలని మనకు డబ్బులు రాకుండా ప్రయత్నాలు చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. కాబట్టి కేంద్రం ఏ లెక్కలు అడిగినా చెప్పేందుకు సంసిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించానని, సమాచారం అంతా ఇచ్చామని చెప్పారు. అందరు ఎమ్మెల్యేలకు యూసీ కాపీలు ఇస్తామన్నారు.