తానా మహాసభలు: చంద్రబాబు ఏమన్నారు? (వీడియో)
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తానా మహాసభలను పురస్కరించుకుని అమెరికాలోని ప్రవాసాంధ్రులకు వీడియో ద్వారా తన సందేశాన్ని పంపారు. విదేశాల్లో స్ధిరపడ్డ వారంతా పెట్టుబడులతో తెలుగు రాష్ట్రాలకు తరలి రావాలని ఆ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాక, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేలా చర్యలు చేపట్టాలని కూడా చంద్రబాబు కోరారు. ప్రవాసాంధ్రుల కోసం ఏపీలో ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
ప్రవాస ఐటీ నిపుణులు ఏపీ గురించి వారంలో కనీసం 5 గంటల నుంచి 10 గంటలైనా ఆలోచించాలని కోరారు. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇందులో ప్రవాసాంధ్రుల పాత్ర ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలను ఏకం చేయడంలో తానా విశేష కృషి చేస్తోందని చెప్పిన చంద్రబాబు, విదేశాల్లో తెలుగు జాతి కీర్తిప్రతిష్టలను మరింతగా ఇనుమడింప జేయాలని పిలుపునిచ్చారు.