బాబుకు అమిత్షా చుక్కలు, తేల్చుకోలేక టిడిపి: ఇప్పటికి జగన్కు అలా చెక్!
పొత్తు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు చుక్కలు చూపిస్తున్నారని అంటున్నారు.
హైదరాబాద్/అమరావతి: పొత్తు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు చుక్కలు చూపిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికి కలిసే ఉన్నామని చెబుతూనే.. 2019లో పొత్తుపై సస్పెన్స్లో పెట్టారు.
రేపు అమిత్ షా, చంద్రబాబు మధ్య భేటీ: ఏం సంకేతాలిస్తారు?
ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రధాని మోడీతో భేటీ అనంతరం పొత్తుల విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోనే వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ బీజేపీ పెద్దలు మాత్రం ఎటూ తేల్చడం లేదు.
నల్గొండలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేస్తామనే సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత ప్రస్తుతానికి టిడిపితో కలిసే వెళ్తామని చెప్పారు. దీంతో టిడిపి పరిస్థితి గందరగోళంలో పడిందని అంటున్నారు. 2019 విషయంలో బీజేపీతో ఎలా ముందుకెళ్లాలో తెలియక చంద్రబాబు సతమతమవుతున్నారంటున్నారు.
వైసిపికి కౌంటర్ ఇచ్చేందుకు..
ప్రస్తుతానికి టిడిపి - బిజెపి పొత్తు కొనసాగుతుందని తేలిపోయింది. వచ్చే ఎన్నికల్లో బిజెపి ఏం చేస్తుందనేది సస్పెన్స్. తెలంగాణలో మాత్రం ఒంటరిగానే వెళ్తుంది. ఏపిలో మాత్రం ఏం చేస్తుందో చెప్పడం లేదు.
అయితే, ఇటీవల మోడీ - జగన్ భేటీ అనంతరం టిడిపికి బిజెపి చెక్ చెబుతుందనే ప్రచారం జరిగింది. దీనికి ముగింపు పలకాలని చంద్రబాబు భావిస్తున్నారు. రేపు బాబు - అమిత్ షా భేటీ కానున్నారు. షాను లంచ్కు ఆహ్వానించారు. దీంతో ఈ ప్రచారానికి తద్వారా వైసిపి ఆనందానికి చెక్ పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు.
కేశినేని నాని వ్యాఖ్యలు వ్యూహాత్మకమేనా
మరోవైపు, ఏపీ టిడిపి నేతలు, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నిన్నటి దాకా కొనసాగింది. కేశినేని నాని అయితే బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఆ మాటలకు తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే నాని వంటి నేతల వ్యాఖ్యలు... భవిష్యత్తులో బిజెపితో చెడినా ముందు జాగ్రత్తలో భాగంగానే ఈ వ్యాఖ్యలు అంటున్నారు.
పొత్తు గందరగోళం..
టిడిపి - బిజెపి పొత్తు తెలంగాణలో ఉండదు. ఏపీలో కొనసాగుతుంది లేదా సస్పెన్స్. మరీ విచిత్రం ఏమంటే.. తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి నడిచేందుకు కూడా సిద్ధమని రేవంత్ రెడ్డి ప్రకటించడం కలకలం రేపుతోంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసిపి. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిథ్యం లేదు.
చంద్రబాబు ఏం చెబుతారు
కానీ టిడిపి పుట్టుందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా అని, ఆ పార్టీతో ఎన్నిటికీ కలవమని చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పారు. తెలంగాణలో కలిస్తే చంద్రబాబు ఏం సమాధానం చెబుతారనేది ప్రశ్నే. ఇప్పటికే కేంద్రమంత్రి దత్తాత్రేయ రేవంత్ వ్యాఖ్యలపై నిలదీశారు.
అప్పుడు తగ్గినా..
2014 ఎన్నికల్లో టిడిపి - బిజెపిలు కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేశాయి. కానీ 2019 ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్తామని తెలంగాణ బీజేపీ నేతలు స్పష్టంగా చెబుతున్నారు. గత ఎన్నికల్లోనే అలా భావించినప్పటికీ ఢిల్లీ పెద్దల సూచనల మేరకు తగ్గారు.
పార్టీలు ఒకటే.. రెండు రాష్ట్రాల్లో రెండు విధాలుగా
ఈసారి కచ్చితంగా ఒంటరిగానే వెళ్లాలని తెలంగాణ టిడిపి నేతలు భావిస్తున్నారు. ఆ దిశలోనే వారు మొదటి నుంచి ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వంతో పోరాడే విషయంలో బీజేపీ సొంతగానే ముందుకు వెళ్తోంది. అదే సమయంలో ఏపీలో బిజెపి - టిడిపిలు కలిసి నడుస్తున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం సాగుతున్నా.. రెండు పార్టీల పెద్దల మధ్య మాత్రం విభేదాలు కనిపించడంలేదు. అయితే ఒకే పార్టీలు రెండు వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉండటం ఏమిటనేది టిడిపి నేతలు గుసగుసలాడుకుంటున్నారట.