గవర్నర్తో బాబు రెండున్నర గంటల భేటీ: కీలక వ్యాఖ్యలు, తెలంగాణపైనా..
విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు, ఏపీలో కేబినెట్ విస్తరణ, కాంగ్రెస్ పార్టీతో పొత్తులతో పాటు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వర్షాల ప్రభావం తదితర ప్రచారం సాగుతున్న నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను కలిశారు. వారిద్దరు దాదాపు రెండున్నర గంటల పాటు భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా తమ రాజకీయ వ్యూహాలు, వైఖరిలో ఎలాంటి రహస్యం ఉండదని చంద్రబాబు ఆయనకు చెప్పారని సమాచారం.
చదవండి: అది గుర్తుంచుకోవాలిగా.. షాకిస్తున్నారు: కన్ఫ్యూజన్గా పురంధేశ్వరి వ్యాఖ్యలు!
Recommended Video
గవర్నరు రాష్ట్ర పర్యటనకు వచ్చి విజయవాడలోని హోటల్లో బస చేశారు. దీంతో ముఖ్యమంత్రి వెళ్లి ఆయనను కలిశారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం, జ్ఞాపికలతో సత్కరించారు. గవర్నర్తో భేటీ తర్వాత చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని గవర్నరు దృష్టికి తీసుకెళ్లానని, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై వివరించానని, కేంద్రం సాయం చేయకపోతే రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందనేది చెప్పానని అన్నారు.
చదవండి: జగన్ వ్యాఖ్యలకు బలమంటూ తేల్చేసిన సాక్షి! బ్రాహ్మణిని కూడా: టీడీపీ ఆగ్రహం వెనుక
మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగలేదు
వరదలవల్ల గోదావరి జిల్లాలకు జరిగిన నష్టాన్ని, ఏరియల్ సర్వేలో తాను పరిశీలించిన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లానని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదన్నారు. పంట నష్టంపై త్వరలో కేంద్రానికి నివేదిక పంపిస్తామన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్ని విధాలా సాయం అందేలా చొరవ తీసుకోవాలని కోరానని, మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం చర్చకు రాలేదన్నారు. కాగా, వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణలో ఒక మైనార్టీ నేతకు చోటు కల్పించాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
గవర్నర్తో తేల్చేసిన చంద్రబాబు
గవర్నర్తో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. తమ రాజకీయ వ్యూహాలు, వైఖరిలో ఎలాంటి రహస్యం ఉండబోదని చెప్పారని సమాచారం. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేదాకా కేంద్రంపై, బీజేపీపై తమ పోరాటం ఆగదని చెప్పారని తెలుస్తోంది. రాజకీయంగా లోపల ఒకటి అనుకుంటూ బయటికి ఒకటి తాము చెప్పమని, ఏదైనా బహిరంగంగానే నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తామని తేల్చి చెప్పారు. మోడీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసం చేసిందన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందని, అందువల్లే మేం బహిరంగంగానే బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకున్నామని చెప్పారని తెలుస్తోంది.
తెలంగాణపై చంద్రబాబు ఇలా
ఏపీ పట్ల కేంద్రం దృక్పథం మార్చుకోనంత వరకు తమ పోరాటం ఆగదని, తమ రాజకీయ వైఖరి కూడా మారబోదని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఇదే విధానాన్ని అనుసరిస్తామన్నారు. తెలంగాణకు సంబంధించిన అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తమ పార్టీ మొత్తంగా తీసుకునే విధానంలో భాగంగానే తెలంగాణలోనూ తమ వైఖరి ఉంటుందని చెప్పారని తెలుస్తోంది. తెలంగాణలో తమ పార్టీ బలపడటం, కేడర్ను కాపాడుకోవడం తమకు ముఖ్యమని చెప్పారని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉందని గవర్నర్ చెప్పారని వార్తలు వస్తున్నాయి. తమకు అలాంటి ఆలోచన లేదని చంద్రబాబు చెప్పారని సమాచారం.
కేరళను ఆదుకోవడానికి స్పందించిన తీరుపై
భారీ వరదలకు అతలాకుతలమైన కేరళను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరును కూడా చంద్రబాబు వివరించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి విడుదల చేసిన బాండ్లు, వాటికి వచ్చిన స్పందనను తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల ప్రారంభం కానున్నాయని చెప్పారు.