స్మార్ట్ సిటీలపై స్విస్ కంపెనీల నుండి బాబు ఆరా, దావోస్లో(పిక్చర్స్)
దావోస్: స్విట్జర్లాండులో స్మార్ట్ సిటీల నిర్మాణం, నిర్వహణలో పాలుపంచుకుంటున్న సుమారు 11 సంస్థల సీఈవోలు వాటి తీరుతెన్నులను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు. సచిత్ర ప్రదర్శనలతో ఆకర్షణీయ నగరాలకు సంబంధించిన వివరాలు చంద్రబాబుకు తెలిపారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యేందుకు మంగళవారం జ్యూరిచ్ చేరుకున్న బాబు బృందం ప్రెస్ వాటర్ కూపర్స్ సంస్థ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొంది.
స్మార్ట్ సిటీల నిర్మాణంలో పాలుపంచుకుంటున్న స్విట్జర్లాండు సంస్థల సీఈవోలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారి నుండి వివరాలు తెలుసుకున్నారు. స్మార్ట్ సిటీల నిర్మాణం, నిర్వహణ తీరుతెన్నులు, వీటిలో సౌర విద్యుదుత్పత్తి, తాగునీటి శుద్ధి, నిర్వహణ, సరఫరా వంటి అంశాలను వారు వివరించారు. చంద్రబాబు పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ అన్నిటికీ అనుకూలమని, పెట్టుబడులతో రండి అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను చంద్రబాబు ఆహ్వానించారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. గతంలో సీఎంగా1995 నుంచి 2004 మధ్యకాలంలో పలుసార్లు దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన చంద్రబాబు.. పదేళ్ల తర్వాత మరోసారి సీఎంగా పాల్గొన్నారు.
చంద్రబాబు
ఈసారి ఏపీ సీఎం చంద్రబాబును, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్లను ఫోరం అధ్యక్షుడు క్లాజ్ ష్వాబ్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఏపీ విజన్ను ఆవిష్కరించారు. గతంలో ఈ సదస్సుకు ఎప్పుడు వెళ్లినా హైదరాబాద్కు వచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరిన చంద్రబాబు.. ఈసారి నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ సంస్థల అధినేతలు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్య వర్గాలను ఆహ్వానించారు.
చంద్రబాబు
ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సన్రైజ్ స్టేట్ కోసం తన విజన్ను ఆయన పవర్పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారప్రముఖులు, వివిధరంగాల్లోని నిపుణులతోనూ బాబు భేటీ అయ్యారు.
చంద్రబాబు
భవిష్యత్లో పట్టణ ప్రాంతాల అభివృద్ధి ఎలా ఉండాలన్న అంశంపై వివిధదేశాల మంత్రులు, మేజర్ మునిసిపాలిటీల సీఈవోలతో మాట్లాడారు. రేపటి కోసం విజన్ పైన జపాన్ ప్రతినిధులు నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా చంద్రబాబు పాల్గొంటారు.
చంద్రబాబు
ఇక భారత్ నుంచి వెళ్లిన ప్రతినిధుల్లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, ఇంధన మంత్రి పీయూష్ గోయల్, ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామమోహన్ రావు, సీనియర్ ఐఏఎస్లు పాల్గొన్నారు.