విజయవాడ: రియో ఒలింపిక్స్ 2016లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పతకాన్ని ఖాయం చేసుకుంది. ఫైనల్కు చేరుకున్న సింధు గెలిస్తే స్వర్ణం, లేదంటే సిల్వర్ ఖాయం. సింధు గెలుపు వెనుక ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కృషి ఎనలేనిది. సింధు తల్లిదండ్రులు, సోదరి కూడా ఆయన పేరునే పదేపదే చెబుతున్నారు.
పీవీ సింధు ఫైనల్కు చేరిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సింధు పైన పెద్ద ఎత్తున ప్రశంసలు కురుస్తున్నాయి.
ఫోటో గ్యాలరీ : రియో దాకా సింధు
ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుల్లెల గోపీచంద్కు ఆనాడు నేను అందించిన సహకారమే ఈ రోజు దేశానికి ఒలింపిక్స్ పతకం తెచ్చిపెట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏపీ మెడిటెక్ జోన్ పెట్టుబడిదారుల సదస్సులో చంద్రబాబు ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తే అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేసిన వాళ్లమవుతారని చెప్పారు.
హైదరాబాదులో ఆనాడు క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేశామని చెప్పారు. పీవీ సింధు బ్యాడ్మింటన్లో ఫైనల్కు చేరడం ఆనంద దాయకమన్నారు. సింధు కోచ్ గోపీచంద్కు తాము ఆనాడు అందించిన సహకారమే ఈ రోజు దేశానికి ఒలింపిక్స్ పతకం తెచ్చిపెట్టిందన్నారు. క్రీడలను ప్రోత్సహిస్తే అత్యుత్తమ క్రీడాకారులు తయారవుతారన్నారు.