హరికృష్ణ భౌతికకాయాన్ని చూసి కన్నీటిపర్యంతమైన చంద్రబాబు, బాలకృష్ణ, పురంధేశ్వరి
Recommended Video
హైదరాబాద్/నల్గొండ: టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు హరికృష్ణ భౌతికకాయాన్ని సందర్శించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి చేరుకున్నారు. హరికృష్ణ ప్రమాద వార్త తెలియగానే చంద్రబాబు, లోకేష్ హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్లో నల్గొండ బయల్దేరారు.
కన్నీటిపర్యంతమైన బాబు
హెలికాప్టర్లో నల్గొండ వచ్చిన చంద్రబాబు.. అక్కడ్నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆస్పత్రికి చేరుకున్నారు. హరికృష్ణ భౌతికకాయం చూసి చంద్రబాబు, లోకేష్ కన్నీటిపర్యంతమయ్యారు.
తీవ్ర భావోద్వేగంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
అంతకుముందు ప్రమాదం గురించి సమాచారం తెలియగానే హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు కామినేని ఆస్పత్రికి చేరుకున్నారు. హరికృష్ణ భౌతికకాయాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
కన్నీటి పర్యంతమైన పురంధేశ్వరి, బాలకృష్ణ
ఆ తర్వాత హరికృష్ణ సోదరుడు బాలకృష్ణ, సోదరి పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్లు, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, సినీనటుడు జగపతిబాబు, తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, సినీ దర్శకుడు త్రివిక్రమ్ తదితరులు ఆస్పత్రి వద్దకు వచ్చారు. ఆస్పత్రి వద్ద పురంధేశ్వరి కన్నీటిపర్యంతమయ్యారు. హరికృష్ణ భౌతికకాయాన్ని చూసి బాలకృష్ణ కంటతడి పెట్టుకున్నారు.
రేపు శంషాబాద్లో అంత్యక్రియలు
కాగా, హరికృష్ణ భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆయన పార్థీవదేహాన్ని హైదరాబాద్ తీసుకురానున్నారు. ఆయన నివాసంతోపాటు సందర్శనార్థం టీడీపీ కార్యాలయంలో ఉంచే అవకాశం ఉంది. గురువారం హరికృష్ణ పార్థీవ దేహానికి శంషాబాద్లోని ఆయన ఫామ్హౌస్లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.