ఎవరితోనూ అమర్యాదగా ప్రవర్తించొద్దు, ఎవరికీ లోటు రానివ్వద్దు: చంద్రబాబు
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ఎవరితోనూ అమర్యాదగా ప్రవర్తించొద్దని, ఎవరికీ లోటు రానివ్వద్దని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి సర్వం సిద్ధమైంది.
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు సభాప్రాంగణంలోని ఏర్పాట్లను పరిశీలించారు. ముందు బ్లాకుల్లోని కుర్చీల్లో కూర్చోని ప్రధాన వేదికతో పాటు, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఉన్నాతాధికారులకు కొన్ని సూచనలు చేశారు.
ఉద్దండరాయుని పాలెంలో అక్టోబర్ 22(గురువారం)న అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి పనులన్నీ పూర్తయ్యాయి. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు విదేశాల నుంచి రాయబారులు, పారిశ్రామిక వేత్తలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.
రాజధాని శంకుస్థాపన రోజున ఏపీ అభివృద్ధికి తొలి అడుగు పడనుంది. గురువారం ఉదయం 9 గంటలకు విజయవాడలోని గేట్వే హోటల్లో జపాన్, ఏపీ ప్రభుత్వాలు ఎంవోయూ కుదుర్చుకోనున్నాయి. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఏపీలో పెట్టుబడులపై జపాన్ మంత్రి యోసుకేతో చంద్రబాబు ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది.
రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లన్నీ పూర్తవడంతో శంకుస్థాపన జరిగే ప్రాంతంలో సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. అమరావతి రాజధానికి సమయం దగ్గర పడుతుండటంతో సామాన్యులు, ప్రముఖులు తరలి వస్తున్నారు. అయితే, కేంద్ర నిఘా సంస్థ, ప్రధాని ప్రత్యేక భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో ఆంక్షలు విధించారు. సందర్శకులకు అనుమతి లేదని ప్రకటించారు. పనులన్నీ పూర్తి కావటంతో బందోబస్తు నిర్వహణపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. అంతక ముందు శంకుస్థాపన కార్యక్రమాలకు ఆటంకం కలిగినా, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో స్థానికులు సెల్ఫీలు దిగినా.. వారి ఉత్సాహం నీరుగార్చలేక పోలీసులు అంగీకరించారు.