సిఎం చంద్రబాబు సాలూరు పర్యటన అనూహ్యంగా రద్దు...కారణాలు ఇవే అంటున్నారు!
విజయనగరం:విజయనగరం జిల్లా సాలూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన అనూహ్యంగా రద్దవడంతో ఆ నియోజకవర్గ ప్రజలు నిరాశ చెందారు.
సీఎం చంద్రబాబు శనివారం సాలూరులోని పెద్దగెడ్డ రిజర్వాయర్ వద్ద జలహారతి ఇవ్వడానికి రానున్నట్లు మీడియాలో వార్తలు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కోసమని జనాలు అక్కడకు రావడం ప్రారంభించారు. అయితే అక్కడ అధికారులు, పోలీసులు హడావుడి లేకపోవడంతో ఆశ్యర్యపోయారు. అది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో సిఎం పర్యటన గోప్యంగా ఉంచారేమోనని భావించారు. అయితే వివిధ కారణాల రీత్యా సిఎం పర్యటన రద్దయిందని తెలిసి నిరాశతో వెనుదిరిగారు.
సిఎం సాలూరు పర్యటన అర్థాంతరంగా రద్దు అవడానికి వివిధ కారణాలు దోహదపడినట్లు తెలుస్తోంది. ప్రధాన కారణంగా ఏవోబీలో మావోల కదలికలు ఉన్న నేపథ్యంలో ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సిఎం పర్యటన కొనసాగేందుకు సానుకూల నివేదికలు వెళ్లలేదని తెలుస్తోంది. మరో వైపు సిఎం జలహారతి ఇవ్వాలనుకున్నపెద్దగెడ్డలో సైతం నీటి నిల్వలు అనుకున్న స్థాయిలో లేకపోవడం కూడా మరో కారణమని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 213.80 మీటర్లు కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్లో 206.20 మీటర్లు నీటి నిల్వ మాత్రమే ఉందని తెలిసింది. నీటి నిల్వ బాగా తక్కువగా ఉండడం వల్లే సీఎం చంద్రబాబు రాకకు స్థానిక పార్టీ నేతలు సైతం ఆసక్తిని ప్రదర్శించలేదని తెలిసింది. దీంతో సిఎం సాలూరు పర్యటన రద్దు చేసుకొని శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల సమీపంలో నాగావళి కి జలహారతి ఇవ్వడానికి వెళ్లారు.
అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే...గత నెల 14న కూడా ఇదే సాలూరు మండలంలో బొడ్డవలస, సాలూరు పట్టణంలో సీఎం చంద్రబాబు పర్యటనకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇక సీఎం వచ్చి గ్రామదర్శినిలో పాల్గొనడం, బహిరంగ సభలో మాట్లాడటమే తరువాయిగా భావించారు. అయితే చివరిక్షణాల్లో వాతావరణం బాగాలేదని పర్యటన వాయిదా వేశారు.
నెల క్రితం ఇక్కడి పర్యటన రద్దయిన నేపథ్యంలో సిఎం చంద్రబాబు పెద్దగెడ్డ పర్యటన ఖచ్చితంగా జరుగుతుందనే అందరూ భావించారు. అయితే ఇలా రెండో సారి సైతం ఇక్కడ సిఎం చంద్రబాబు పర్యటన రద్దవడంతో స్థానిక టిడిపి శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి. అయితే టిడిపి ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న గిరిజన గర్జన సాలూరు నియోజక వర్గంలో జరిగే అవకాశాలున్నాయని, ఆవిధంగానే జరగాలని స్థానిక టిడిపి శ్రేణులు బలంగా కోరుకుంటున్నాయి.