బీజేపీ వాళ్లని రాజ్యసభకు పంపించా, రాజధానికి 33వేల ఎకరాలు అందుకే: పవన్కు బాబు
హైదరాబాద్: తమ సహకారంతో బీజేపీ వాళ్లను ఇద్దరిని రాజ్యసభకు పంపించామని, ఆ మాత్రం విశ్వాసం కూడా ఆ పార్టీకి లేకుండా పోయిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం మండిపడ్డారు.
రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశ్యంతో తాను త్యాగాలు చేశానని చెప్పారు. టీడీపీ నాయకులను పక్కనబెట్టి బీజేపీ వారిని ఎంపీలుగా చేశానన్నారు. తాను ఒక్క పదవిని ఆశించలేదని, రాష్ట్ర సమస్యలు పరిష్కరించాలని కోరడమే తప్పా అన్నారు.
తాము రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామని, విభజన డిమాండ్లు, ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతుంటే బీజేపీ కాదని చెబుతూ ఎదురుదాడికి దిగుతోందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లితే ఊరుకునేది లేదన్నారు.
మనవడిపై బాబు: 40మంది పంచాంగకర్తలు కలిసి.. 12 ఏళ్లు అధికారంలో జగన్, లేదంటే గుడ్బై!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కూడా చంద్రబాబు పరోక్ష విమర్శలు చేశారు. కొంతమంది రాజధానికి 33వేల ఎకరాలు ఎందుకు అని అడుగుతున్నారని, ఇచ్చిన రైతుల స్ఫూర్తిని పరిగణలోకి తీసుకోకుండా ఇలా ప్రశ్నించడం ఏమిటన్నారు.
ఏ నగర నిర్మాణం ఆకాశంలో జరగదన్నారు. అమరావతిలో ఏమీ కనిపించడం లేదంటున్నారని, కానీ తాను ఇప్పటికే అసెంబ్లీ, సచివాలయం కట్టానని, హైకోర్టు వంటి మరికొన్ని భవనాలు కట్టిస్తే సరిపోతుందన్నారు.
రాజధాని అంటే నాలుగు భవనాలేనా అని ఆలోచించి చూడాలన్నారు. రాజధాని అంటే ఇది కాదని, ప్రజలు వచ్చి ఉండాలని, మౌలిక వసతులు కావాలని, నాణ్యమైన, విశాలమైన రోడ్లు ఉండాలన్నారు. తమిళనాడుకు చెన్నై, కర్నాటకకు బెంగళూరు, మహారాష్ట్రకు ముంబై ఉన్నట్లు ఏపీకి మంచి రాజధాని అవసరం లేదా అన్నారు.