మాట మార్చిన అశోక్ బాబు: సాకులు చెప్పొద్దంటూ చంద్రబాబు సీరియస్
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి జూన్ 27 నాటికి ఉద్యోగులు తరలివస్తారా? లేదా అనే విషయంపై ఇంకా సందిగ్ధత వీడలేదు. రాజధాని ప్రాంతంలో నిర్మాణం జరుపుకుంటున్న తాత్కాలిక సచివాలయం పనులు చివరి దశకు వచ్చేశాయి. ఈ నెల 27 నుంచి నవ్యాంధ్ర నుంచే పరిపాలన కొనసాగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు సైతం గట్టిగా చెబుతున్నారు.
ఉద్యోగుల తరలింపు విషయంలో నిన్నటి వరకూ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్ బాబు... ఆదివారం మాట మార్చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. కనీస మౌలిక సదుపాయాలు లేకుండా రాజధానికి ఎలా వస్తామంటూ ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతోంది.
అవసరమైన మౌలిక వసతులన్నింటినీ ఏర్పాటు చేసిన తర్వాతే తాము అమరావతికి వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం విజయవాడలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అశోక్ బాబు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ నెల 27లోగా ఉద్యోగులంతా అమరావతికి తరలి రావాల్సిందేనని స్పష్టం చేశారు. ''రాజధానికి తరలివచ్చే ఉద్యోగులు, అద్దెలు బాగా పెరిగిపోయాయని చెబుతున్నారు. వారు అలా సాకులు చెప్పటం కరెక్టుకాదు. ఎట్టిపరిస్థితుల్లోనూ వారు సిద్ధపడాల్సిందే''నని చంద్రబాబు స్పష్టం చేశారు.
అదేసమయంలో గుంటూరు, విజయవాడల్లో ప్రజలు అద్దెలు పెంచటమూ సముచితం కాదని అన్నారు. సామాజిక స్పృహతో అభివృద్ధికి అంతా సహకరించాలని ఆయన కోరారు. మరోవైపు మంత్రి నారాయణ తుళ్లూరులో మాట్లాడుతూ తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు ఈ నెల 27 నాటికి పూర్తవుతాయని అన్నారు.
ఆదివారం ఆయన నిర్మాణ పనులు జరుగుతున్న భవనాలను పరిశీలించారు. '' తాత్కాలిక సచివాలయం కోసం సిద్ధం చేస్తున్న ఐదు బిల్డింగ్లకు రెండు శ్లాబులు పడ్డాయి. భవనాల లోపల బ్రిక్స్ వర్క్ 70 శాతం పూర్తయింది. ప్రస్తుతం ఎలక్ర్టికల్, ప్లంబింగ్, సీలింగ్ పనులు జరుగుతున్నాయి'' అని వివరించారు.
ఉద్యోగుల తరలింపులో సమస్యలు ఉన్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని.. 80శాతం సచివాలయ ఉద్యోగులు తరలిరావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు పట్టణాలలో హెచ్వోడీల కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. సచివాలయంలోని అంతర్గత రోడ్లకు టెండర్లు ఖరారు చేశామన్నారు.