మోడీ సహా వారికి బాబు 10 రోజుల్లో 10 లేఖలు, గుండు కొట్టించుకుంటానని కుటుంబరావు సవాల్
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప స్టీల్ ప్లాంటు పైన బుధవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా విభజన హామీలను కూడా ప్రస్తావించారు. చంద్రబాబు పది రోజులుగా కేంద్రానికి విభజన హామీలపై లేఖలు రాస్తున్నారట. వివిధ అంశాలపై ఆయన ప్రధాని మోడీ, కేంద్రమంత్రులకు లేఖలు రాస్తున్నారు.
కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై మెకాన్ సంస్థ ఇచ్చిన సాధ్యాసాధ్యాల నివేదిక ఆధారంగా సుప్రీంలో సవరణ అఫిడవిట్ను కేంద్రం వెంటనే దాఖలు చేయాలని కోరుతూ సోమవారమే మోడీకి చంద్రబాబు లేఖ రాశారు. ఈ లేఖ వివరాలను ప్రభుత్వం బుధవారం వెల్లడించింది.
10 రోజుల్లో పది లేఖలు
సెయిల్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇటీవల సుప్రీంలో కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఈ ప్రాజెక్టు ఆర్థికంగా అనుకూలం కాదంటూ అఫిడవిట్ దాఖలు చేసిందని, ఇది ఏపీ ప్రజలకు ఆందోళనను కలిగించిందని, వారి మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈ ప్రాజెక్టు వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఆర్థికంగా దన్నుగా ఉంటుందని, సుప్రీంలో వెంటనే సవరణ అఫిడవిట్ను దాఖలు చేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆయన పది రోజుల్లో 10 లేఖలు రాశారు.
పలు అంశాలపై చంద్రబాబు లేఖలు
విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభును కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశా కాలుష్య నియంత్రణ మండలి, చత్తీస్గఢ్ పర్యావరణ సంరక్షణ బోర్డు ఇచ్చిన పనుల నిలిపివేత ఉత్తర్వులను పూర్తిస్థాయిలో ఉపసంహరించేలా మరో లేఖ రాశారు. గ్యాస్ గురించి పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు, తిరుమల విషయంలో పురావస్తు శాఖ కార్యాలయం మొదలు అమరావతి సర్కిల్ వరకు జరిగిన వ్యవహారాలపై విచారణ జరిపించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మకు, జీడిపప్పు పరిశ్రమ గురించి వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభుకు, బకాయి వసూళ్లు, విద్యుత్ రంగం ఒత్తిడిపై మరో కేంద్రమంత్రికి, విశాఖలో పౌర విమానాల రాకపోకల సమయాలపై ఆంక్షలు విధించవద్దని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు.
Recommended Video
గుండు కొట్టించుకుంటా.. కుటుంబ రావు సవాల్
కేంద్రం సాయంపై టీడీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్న రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావుకు, బీజేపీ నేతలకు ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబ రావు కౌంటర్ ఇచ్చారు. 2017 మార్చి తర్వాత కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. నిరూపిస్తే గుండు కొట్టించుకుంటానని చెప్పారు. ఆయన ఓ టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి ఆగవద్దనే తాము అప్పుడు కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించామని చెప్పారు.
రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా కోరుకున్నాం
పోలవరం ప్రాజెక్టు డీపీఆర్ 2ను కేంద్రం ఇప్పటి వరకు ఆమోదించలేదని తెలిపారు. తాము రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా కావాలని కోరుకున్నామని చెప్పారు. 2015-16 వరకు ఆరు ప్రాజెక్టులకు వడ్డీతో సహా ఖర్చులను కేంద్రం భరిస్తుందా చెప్పాలని నిలదీశారు. మే 30న రెసిడెంట్ కమిషనర్కు మరో లేఖ రాశారని చెప్పారు. ప్రాజెక్టుల విషయంలో వడ్డీ సహా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు.