అమ్మతోడు: పట్టిసీమపై చంద్రబాబువి కథలే, తగ్గిన పంటల సాగు
‘పట్టి సీమ ద్వారా నీరు ఇచ్చాం.. రైతులు రెండు నెలల ముందే వరి సాగు చేసుకొనే అవకాశం వచ్చింది' అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది కాలంగా భారీ ప్రచారార్భాటంతో ఊదరగొట్టింది.
అమరావతి: 'పట్టి సీమ ద్వారా నీరు ఇచ్చాం.. రైతులు రెండు నెలల ముందే వరి సాగు చేసుకొనే అవకాశం వచ్చింది' అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది కాలంగా భారీ ప్రచారార్భాటంతో ఊదరగొట్టింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నెలలోనే నీటిని విడుదల చేస్తున్నామని ప్రకటించినా పశ్చిమ డెల్టా రైతులు ప్రభుత్వ ప్రచారాన్ని పట్టించుకొలేదు.
రైతులు సంప్రదాయబద్ధంగా ఏటా సాగు చేస్తున్న మాదిరిగా ఈ నెలలోనే వరి సాగు ప్రారంభించారు. దీనికి ప్రధాన కారణం జూన్లోనే సాగు ప్రారంభిస్తే అక్టోబర్, నవంబర్లో పంట కోతకు వస్తోంది. ఆ సమయంలో తుఫాన్లు వస్తే భారీ నష్టం సంభవిస్తుందనే కోణంలో రైతులు ఆలోచిస్తున్నారు. తూర్పుగోదావరి, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో రైతులను వర్షాభావ భారం వెంటాడుతున్నది. సకాలంలో రుణాలు అందక రైతులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఇక ఎన్నికల వేళ అందరి సమస్యలు తీరుస్తామని నమ్మ బలికే సర్కార్.. అధికారంలో వచ్చాక నిబంధనల సాకు అడ్డంకిగా మారింది. తత్ఫలితంగా కౌలు రైతుల బాధలు చెప్పనలవి కాదు. జూలై నెలాఖరు వరకు సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు మెట్ట పంటలు సాగు చేయడానికి కూడా వెనుకాడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే సాగునీటి సంగతేమిటో గానీ తాగునీటికి ఇబ్బందుల పాలవ్వాల్సి వస్తుందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
పశ్చిమ గోదావరిలో భారీగా తగ్గిన మిర్చి సాగు ఇలా పెరిగిన పత్తి సాగు
జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 13,38,035 ఎకరాలు కాగా, ఇప్పటి వరకూ కేవలం 7,83,765 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఇందులో 4,63,527 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. గతేడాది మిర్చి పెద్దఎత్తున సాగు చేసిన రైతులు ఈ ఏడాది పత్తి సాగుపై దృష్టి సారించారు. ఇటీవల మిర్చి ధర భారీగా పతనం కావడం వల్లే ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది ఇదే సమయానికి 1,02,105 ఎకరాల్లో మిర్చి సాగు చేపట్టగా ఈసారి కేవలం 29,810 ఎకరాల్లో మాత్రమే మిర్చి సాగు చేయడం గమనార్హం. నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో ఈ ఏడాది వరి సాగు చేసే అవకాశం లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయంగా పత్తి సాగు చేస్తున్నారు. అపరాల పంటలు వేసేందుకు కూడా ఆసక్తి చూపటం లేదు.
400 కోట్లకు రూ.62 కోట్ల రుణాలు
కౌలు రైతుల పట్ల ప్రభుత్వ సవతి ప్రేమ చూపిస్తోంది. జిల్లాలో ఖరీఫ్ రుణ లక్ష్యం రూ. 5,193 కోట్లు కాగా, ఇప్పటివరకూ రూ.4,000 కోట్లకు పైగా రుణాలు అందాయి. ఇప్పటికే వరి పంటకు తప్ప, అన్ని రకాల పంటలకు పంట బీమా గడువు ముగిసింది. జిల్లాలో దాదాపు 2 లక్షల మందికి పైగా కౌలు రైతులు పంట సాగు చేస్తున్నారు. అయితే వీరిలో ఎల్ఈసీ కార్డులు, సీఓసీ పత్రాలు కేవలం 70 వేల మందికి మాత్రమే అందాయి. ప్రభుత్వం ఈ ఏడాది కచ్చితంగా రైతులకు ఇస్తున్న రుణాల్లో 10శాతం రుణాలను కౌలు రైతులకు ఇవ్వాలని నిబంధన పెట్టింది. అంటే రూ.400 కోట్ల మేర కౌలు రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కేవలం 14,000 వేల మంది కౌలు రైతులకు నామమాత్రంగా రూ. 62 కోట్లు ఇవ్వడం గమనార్హం. వరి పంటకు సైతం ఆగస్టు 21తో బీమా గడువు ముగిసింది. ఖరీఫ్లో ఇంకా దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సింది. వీరంతా పంటల బీమా చేసుకొనే అవకాశం కోల్పోనున్నారు.
జలాశయాల నీటి విడుదల చేసినా.. సాగు అంతంతే
తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్లో వరి నాట్లలో జాప్యం కొనసాగుతూనే ఉంది. మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో నాట్లు వేసేందుకు సరిపడా నీరు అందుబాటులో లేక అక్కడి రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి కొన్ని జలాశయాల నుంచి జులై మూడో వారంలో నీటిని విడుదల చేయడంతో కొంత మేర నాట్లు ప్రారంభమైనా ఇంకా మందకొడిగానే సాగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 80 శాతం మేర వరి నాట్లు పూర్తయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. డెల్టాలో దాదాపు 95 శాతం మేర నాట్లు పూర్తి కాగా మెట్టలో 60 నుంచి 70 శాతం మేర జరిగినట్లు వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి. జూన్ ఒకటో తేదీకి గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేసి సాగు కాలాన్ని ముందుకు తీసుకురావాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. తదనుగుణంగా జలవనరుల శాఖ డెట్టా ప్రాంతానికి నీటిని విడుదల చేసింది.
అప్పటికే రైతులు సన్నద్ధంగా లేకపోవడం, నారు చివరి దశలో ఉన్నప్పుడు, పలు చోట్ల నాట్లు వేసిన తొలినాళ్లలో వర్షాలు కురవడంతో అన్నదాతలు ఇబ్బందులకు గురయ్యారు. తూర్పు, మధ్య డెల్టా పరిధిలో 1,38,572 హెక్టార్ల సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు 1,29,309 హెక్టార్లలో నాట్లు పూర్తయినట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని డెల్టా ప్రాంతంలోనే మూడు పంటలు వేసేందుకు అవకాశం ఉన్నదని, గతం కన్నా 15 రోజులు ముందుగా ఈ ప్రాంతంలో సాగు ప్రక్రియ ప్రారంభమైందని చెబుతున్నారు. మెట్ట, ఏజెన్సీ పరిధిలోని రైతులకు సాగునీటి విడుదలలో ఆలస్యం కావడంతో నాట్లకు ఇబ్బందులు తలెత్తాయి. జులై చివరి వారం, ఆగస్టు నుంచి వరి నాట్లు వూపందుకున్నా శివారు ప్రాంతాలకు సాగునీటి సమస్య వెంటాడుతోంది. మెట్ట, ఏజెన్సీలో 2,32,502 హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు 1.94 లక్షల హెక్టార్లలో నాట్లు పడినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
సాయమూ అంతకన్నా లేదు!
విజయనగరం జిల్లాలో వ్యవసాయ సీజన్కు ప్రధానమైన జూన్ నెలలో వర్షపాతం లోటు కనిపిస్తుంది. సాగుకు జూన్ నెల వర్షపాతం కీలకం. 128.4 సాధారణ వర్షపాతం ఉండాల్సి ఉండగా... 121.3శాతమే నమోదైంది. -6 మి.మీ. వర్షపాతం లోటు ఏర్పడింది. జులైలో 178.7 మి.మీ. సాధారణ వర్షపాతం. ఇంతవరకు 18.4 మి.మీ. మాత్రమే కురిసింది. దీని ప్రభావం సాగుపై పడింది. నేటికీ రైతులు పూర్తిస్థాయిలో సాగుకు సన్నద్ధం కాలేదు. జిల్లాలో ప్రధాన వరిపంట 1..18 లక్షల హెక్టార్లలో సాగువుతోంది. ఇప్పటివరకు 2,250 హెక్టార్లులో మాత్రమే సాగు జరిగినట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ఇక బ్యాంకుల పరంగా రుణసాయం కొరవడుతోంది. వాణిజ్యబ్యాంకులు, సహకార బ్యాంకుల ద్వారా రుణలక్ష్యాలను ఏటా నిర్దేశిస్తున్నారు. 2017-18లో రూ.1850 కోట్లు రుణసాయం అందించాలని బ్యాంకులు వార్షిక రుణ ప్రణాళికలో ఆమోదించాయి.
ఇందులో ఖరీఫ్కు 1295 కోట్లు ఇవ్వాలి. ఇప్పటి వరకు రూ.200 కోట్లు మాత్రమే ఇచ్చాయి. ఇచ్చిన రుణాల్లో ప్రధానంగా పునరుద్ధరణ రుణాలకే బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తున్నాయి. జిల్లాలో 4.50 లక్షల మంది రైతులున్నారు. ఇందులో సహకార రుణాలపై ఆధారపడినవారు సుమారు లక్షమంది. వీరికి ఏటా ఆప్కాబ్ ద్వారా వచ్చే సాయంపైనే వీరి రుణసాయం ఆధారపడి ఉంది. ఖరీఫ్లో రూ.178.5 కోట్లు రుణాలు లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు రూ.50 కోట్లు వితరణ జరిగింది. గత ఏడాదిలో కొత్తరైతులకు రూ.30 కోట్లు నిర్దేశించినా కేవలం రూ.10 కోట్లు వరకే అందించగలిగారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు కౌలురైతులకు పది శాతం రుణాలు ఇవ్వాల్సి ఉంది. సహకార సంఘాల్లో ఇచ్చేందుకు వీలుకాదు. వీరికి అందుతాయో లేదో ప్రశ్నార్ధకమే. వాణిజ్య బ్యాంకుల ద్వారా అందజేసేందుకు ఇంకా రుణఅర్హత కార్డులు జారీ దశలోనే ఉన్నాయి. పదివేల మందికే జారీ జరిగాయి. రెవెన్యూ సదస్సుల్లో వీటికి ప్రాధాన్యం కల్పించారు. ఆచరణలో రైతులకు మేలు జరిగేదెప్పుడోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ విషయంలో రైతులకు రుణ బకాయిలున్నాయి. ఇప్పటివరకు రెండు విడతలుగా మాత్రమే విడుదలయ్యాయి. వీరంతా పునరుద్ధరించుకుంటేగాని కొత్త రుణం అందే పరిస్థితి లేదు. జిల్లాలో ఇలా రూ.200 కోట్లు వరకు పునరుద్ధరణ కావాల్సి ఉంది.
ఆర్తిగా వర్షాల కోసం నెల్లూరు రైతు ఆశగా ఎదురుచూపులు
నెల్లూరు జిల్లా రైతులు వరుణుడి కరుణ కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు ముందుగానే వస్తాయని.. అల్పపీడనాల వల్ల వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు వరి నారుమడులు పోశారు. వేరుశనగ, ఇతర పంటలు సాగు చేసే రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు. జిల్లాలో జూన్ నెలలో 86.30 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 56.80 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. వర్షాలు ఆశాజనకంగా లేక వేరుశనగ సాగుచేసే రైతుల్లో చాలామంది చేలల్లో విత్తనాలు నాటలేదు. ఈ నెల ఆరంభం నుంచి వాతావరణంలో తేమ ఉంటున్నా ఆశి చిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో మెట్ట ప్రాంత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరినాట్లు వేసిన రైతులు, విత్తులు పూర్తి చేసిన ఇతర రైతులు ఇప్పటివరకు పెట్టిన వేల రూపాయల పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 50,516 హెక్టార్లలో వరి సాగు చేయాలని లక్ష్యం కాగా, జూలై నెలాఖరు వరకు 15,964 హెక్టార్లలో మాత్రమే వరినాట్లు వేశారు. 8,177 హెక్టార్లలో వేరుశనగ సాగు చేయాల్సి ఉండగా.. 6,634 హెక్టార్లలో మాత్రమే విత్తులు వేశారు. పత్తి పంటను 4,666 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా.. 3,422 హెక్టార్లకు మాత్రమే పరిమితమైంది. జిల్లాలో ఎక్కడా ఒక్క ఎకరంలో కూడా కంది విత్తనాలు వేయలేదు.
భవిష్యత్లో తాగునీటికే ప్రాధాన్యమా?
వర్షాభావ పరిస్థితులతోపాటు జలాశయాలు సైతం రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. జిల్లాలో ప్రధాన సాగునీటి వనరులైన సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటిమట్టాలు అడుగంటుతున్నాయి. సోమశిల జలాశయంలో 7.41 టీఎంసీలు, కండలేరులో 4.652 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నెల్లూరు జిల్లాతోపాటు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, తిరుపతి తాగునీటి అవసరాలకు తప్ప వీటినుంచి సాగునీటిని విడుదల చేసే అవకాశాలు ఉండవని రైతులు ఆందోళన చెందుతున్నారు.