ఏం తమ్ముళ్లూ! మీకు రోషం లేదా? పౌరుషం లేదా? కేసీఆర్ తొత్తులకు ఓటేస్తారా? : చంద్రబాబు
కాకినాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో వేడి పెంచారు. వాడి పదాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ.. ఆయన తన ప్రచార శైలిని మార్పులు తెస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేస్తోన్న విమర్శల్లో పదును పెంచారు. కోడి కత్తి పార్టీ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. కేసీఆర్ కు తొత్తులాగా మారారంటూ మండిపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆయన ఆదివారం తూర్పు గోదావరి జిల్లా తునిలో బహిరంగ సభలో ప్రసంగించారు. మోడీ-కేసీఆర్-జగన్ లను రాష్ట్ర ద్రోహులుగా అభివర్ణించారు. ఈ ముగ్గురూ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణానికి అడుగడుగునా అడ్డు పడుతున్నారని విమర్శించారు.
రాహుల్ గాంధీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎంట్రీకి ఆ స్థానమే ఎందుకు?
జగన్ తో పోరాడటం నాకు నామోషీగా..
వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తాను పోరాడాల్సి రావడం నామోషీగా అనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. 240 రోజుల పాటు జైలులో ఉండి వచ్చిన జగన్ ను తాను ఈ ఎన్నికల్లో ఎదుర్కొంటానని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. 31 కేసులు జగన్ మీద ఉన్నాయని చెప్పారు. తన మీద ఒకే ఒక్క కేసు ఉందని అన్నారు. తెలంగాణ కోసం తాను బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేశానని, అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ ఒక్క కేసు తప్ప తన మీద మరేవీ లేవని చెప్పారు. జగన్, మోడీ, కేసీఆర్ అసత్యాలు పలుకుతున్నారని అన్నారు. కేసీఆర్ ఆంధ్రులను తిడుతున్నారని అన్నారు. `మనం కుక్కలమా? ద్రోహులమా?..` అని చంద్రబాబు నిలదీశారు. ఆంధ్రులకు రోషం, పౌరుషం లేవా? అని చంద్రబాబు చెప్పారు.
60 సంవత్సరాలు కష్టపడి హైదరాబాద్ ను అభివృద్ధి చేశా..
హైదరాబాద్ సహా తాను అన్నీ వదిలి వచ్చినప్పటికీ.. కేసీఆర్ మాత్రం తన మీద దాడి చేస్తూనే ఉన్నారని చంద్రబాబు అన్నారు. అమరావతిని కట్టడానికి కేసీఆర్ అడ్డం పడుతున్నారని చెప్పారు. అడ్డుగా వచ్చిన వారిని వదిలి పెట్టబోమని, వారిని తొక్కుకుంటూ వెళ్తామని అన్నారు. జగన్ కు లోటస్ పాండ్ లో ఏం పని అని అన్నారు. జగన్ పార్టీ అభ్యర్థులను కూడా కేసీఆర్ ఎంపిక చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. తాను 60 సంవత్సరాల పాటు రేయింపగళ్లు కష్టపడి హైదరాబాద్ ను అభివృద్ధి చేశానని, విమానాశ్రయాన్ని, ఔటర్ రింగ్ రోడ్డును కట్టానని చెప్పారు. అయినప్పటికీ.. కేసీఆర్ తనను టార్గెట్ చేసుకున్నారని చెప్పారు. `ఖబర్దార్ కేసీఆర్! మా ఇంటికి మీ ఇళ్లు ఎంత దూరమో.. మీ ఇంటికి మా ఇళ్లు అంతే దూరం. తెలుగువారికి ఆత్మగౌరవం ఉంది. ఎవరైనా అడ్డు పడితే వదిలి పెట్టను. మీ పెత్తనం మా మీద ఎందుకు? 60 సంవత్సరాలు నేను కష్టపడ్డాను. దోచుకున్నది చాలలేదా? కేసీఆర్ రాష్ట్రానికి లక్ష కోట్లు ఇవ్వాలి. ఇచ్చారా?..` అని చంద్రబాబు చెప్పారు.
నాకు కులం లేదు..మతం లేదు..
తనకు కులం లేదని, మతం లేదని చంద్రబాబు చెప్పారు. పేదరికమే తన కులమని అన్నారు. అందరి వాడిలాగా తాను శాశ్వతంగా మిగిలిపోతానని అన్నారు. జయహో బీసీ అని సభ పెట్టి, వెనుకబడిన వర్గాల కోసం చాలా చేశామని, ఇంకా చేస్తామని అన్నారు. బీసీల కోసం 21 కార్పొరేషన్లు పెట్టానని, ఆదరణ 2 తీసుకొచ్చానని అన్నారు. కోడికత్తి పార్టీ బీసీల కోసం ఏమీ చేయలేదని అన్నారు. బీసీలకు ఇంకా సేవ చేస్తానని, బీసీలకు ఎక్కువగా రుణపడి ఉన్నానని అన్నారు. రాజకీయంగా వారికి ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. 10 వేల కోట్లతో బీసీ బ్యాంకును ఏర్పాటు చేస్తానని చంద్రబాబు చెప్పారు. సామాజిక న్యాయం తమకు మాత్రమే సొంతమని అన్నారు. కాపులకు న్యాయం చేస్తానని చెప్పారు.
కోడికత్తి పార్టీకి అవకాశం ఇస్తే.. ఆత్మహత్య చేసుకున్నట్టే
ఎన్నికల్లో పారదర్శకత రావాలంటే కనీసం 50 శాతం స్లిప్పులను లెక్కించాలని అన్నారు. దీనిపై చర్చ జరగాలని అన్నారు. తాము ఓడిపోతామని కోడికత్తి పార్టీకి దిగులు పట్టుకుందని ఎద్దేవా చేశారు. వైఎస్ హయాంలో అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలుకు పోయారని అన్నారు. కోడికత్తి పార్టీకి అవకాశం ఇస్తే, ఆత్మహత్య చేసుకున్నట్లేనని అన్నారు. ఆ పార్టీకి ఓటు వేసి, కొండ మీది నుంచి లోయలోకి దూకుతారా అని నిలదీశారు. తమ బిడ్డల భవిష్యత్తును అంధకారం చేసుకుంటామా? అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వస్తే, రాష్ట్రం రౌడీల మయం, కబ్జాదారుల మయం అవుతుందని నూటికొక్కరు తయారవుతారని అన్నారు. జగన్ కు ఓటు వేస్తే మనకు మనమే మరణ వాంగ్మూలం రాసుకున్నట్టు అవుతుందని చంద్రబాబు చెప్పారు.
టీడీపీ గెలవడం చారిత్రక అవసరం..
తెలుగుదేశం పార్టీ గెలవడం చారిత్రక అవసరమని చంద్రబాబు అన్నారు. తాము ఓడిపోతే.. అమరావతి నిర్మాణం నిల్చిపోతుందని అన్నారు. ప్రాజెక్టులు ఆగిపోతాయని చెప్పారు. జగన్ కు ఏమీ చేయటం తెలియదని, మాటలు మాత్రం తెలుసని అన్నారు. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు బీచ్ రోడ్ వేస్తామని అన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రపంచం మొత్తం మన వద్దకే వచ్చేలా చేస్తానని అన్నారు. ప్రజలందరూ తనకు అండగా నిలబడి పోరాడితేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. గద్దల మాదిరిగా, రాక్షసుల మాదిరిగా జగన్, కేసీఆర్, మోడీ రాష్ట్రంపై వాలుతున్నారని చెప్పారు. తెలుగుదేశం గెలవడం చారిత్రక అవసరమని, కేసీఆర్ మనుషులను చిత్తుచిత్తుగా ఓడించి, భూస్థాపితం చేస్తామని చెప్పారు. యువత రక్తం మరగాలని, ఉత్తేజం పెరగాలని చెప్పారు. అల్లూరి సీతారామారాజు స్ఫూర్తిని పుణికి పుచ్చుకోవాలని చెప్పారు. `రోషం లేదా? ఆత్మగౌరవం లేదా? జగన్ ను గెలిపిస్తారా? నేను పోరాట వీరుడిని, ఆశీర్వదించండి..` అని చంద్రబాబు అన్నారు.