నేనేంటో చూపించాలని మనవడిని తీసుకొచ్చా! కోడలితో కలిసి బహిరంగ సభలో చంద్రబాబు
అమరావతి: మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం పరిసమాప్తం కానున్న నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్టుండి తన కుటుంబ సభ్యులను తెర మీదికి తీసుకొచ్చారు. వారితో కలిసి ఏకంగా బహిరంగ సభలో పాల్గొన్నారు. తానేంటో నిరూపించడానికి, తనలోని ఫైర్ ఎలా ఉంటుందో చూపించడానికి మనవడిని తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. కృష్ణా జిల్లాలోని నందిగామ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు చంద్రబాబు, బ్రాహ్మణి, దేవాన్ష్ లతో కలిసి హాజరయ్యారు.
చంద్రబాబు ఒక కారులో, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ మరో కారులో వచ్చారు. చంద్రబాబుతో కలిసి వేదికపైకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని బ్రాహ్మణి వేదికపై ముందు వరుసలో కూర్చున్నారు. ఆమె పక్కనే దేవాన్ష్ కనిపించాడు. బ్రాహ్మణి కూడా ప్రసంగిస్తారని అభిమానులు ఆశించినప్పటికీ.. అలా జరగలేదు. తన మనవడితో రావడానికి కారణం ఉందని వేదికపైన ఉన్న నాయకులతో చెప్పారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా తమ కుటుంబ సభ్యులేనని, దేవాన్ష్ ను వారికి పరిచయం చేస్తానని, తనలోని ఫైర్ ను చూపిస్తానని అన్నారు.
కేఏ పాల్ కామెడీ! ఏడాదిలో ఏపీ అసెంబ్లీని రద్దు చేయించేస్తా! మాయావతి మాయలో పవన్ కల్యాణ్
నిరుద్యోగ భృతి రూ.3000
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఇచ్చే భృతిని 3000 రూపాయలకు పెంచుతానని అన్నారు. తాను ఇచ్చే మూడు వేల రూపాయలతో తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఉన్న మనవడు, మనవరాళ్లు తెలుగుదేశం ప్రభుత్వం రావాలనే కోరుకుంటున్నారని చెప్పారు. జాబు రావాలంటే.. బాబు రావాలనే నినాదాన్ని నిజం చేశామని అన్నారు. ఈ అయిదేళ్లలో రాష్ట్రంలో 30 లక్షల ఉద్యోగాలను ఇచ్చామని చంద్రబాబు చెప్పారు. మరోసారి తాము అధికారంలోకి వచ్చిన ఏడాది లోపల.. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. తాను సృష్టించిన ఐటీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని, సిలికాన్ వేలీలో లక్షల రూపాయల వేతనానికి పని చేస్తున్నారని అన్నారు.
నచ్చిన ఉద్యోగం.. నచ్చిన ప్లేస్!
మరోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే.. యువతకు ఉద్యోగాలను కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. యువతకు తాము నచ్చిన ఉద్యోగాన్ని, నచ్చిన ప్రాంతంలో చేసుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు కూడా నిరుద్యోగ భృతిని వర్తింపజేస్తామని చెప్పారు. 12 లక్షల కోట్ల రూపాయల మేర ఎంఓయూలను కుదుర్చుకున్నామని, అవన్నీ వాస్తవరూపం దాల్చుతాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అమరావతి, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, ఒంగోలు, నెల్లూరు.. ఇలా అన్ని ప్రతి నగరాలనూ ఉద్యోగాల హబ్ గా తీర్చిదిద్దుతామని, ఆ శక్తి సామర్థ్యాలు తనకు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఈ దిశగా తన ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుందని, వాటిని కొనసాగించాలంటే, మరోసారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
హైదరాబాద్ నుంచి అవమానకరంగా పంపించారు..
ఉమ్మడి రాజధానిలో పదేళ్ల పాటు నివసించే అవకాశం ఉన్నప్పటికీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీమాంధ్రులను అత్యంత అవమానకరంగా స్వరాష్ట్రానికి పంపించారని అన్నారు. సీమాంధ్రులను కుక్కలుగా, రాక్షసులుగా తిట్టారని ధ్వజమెత్తారు. ఈ మాటలు వింటే పౌరుషం రావట్లేదా? అని ప్రశ్నించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను తాను ఎప్పటికీ సమర్థించబోనని, ఆ పని ఎవరు చేసినా.. వారిని విడిచిపెట్టబోనని అన్నారు. కోడికత్తి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ తిష్ట వేశారని, కేసీఆర్, మోడీలతో కలిసి తనపై కుట్ర పన్నుతున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రేపో, మాపో ఆ కుట్రను అమలు చేస్తారని అన్నారు. వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోలో అమరావతి గురించిన ప్రస్తావనే లేదని అన్నారు. దీనికి వెనుక కూడా కుట్ర ఉందని అన్నారు. అమరావతి అభివృద్ధి చెందితే.. హైదరాబాద్ కు తీవ్ర నష్టం కలుగుతుందని, అలా జరగ కూడదనే ఉద్దేశంతోనే కోడికత్తి పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు.