హోంగార్డులకు, పోలీసులకు తేడాలేదు...ఇది చైతన్య సభ:సిఎం చంద్రబాబు
విజయవాడ: రాష్ట్రంలో హోంగార్డులు క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటున్నారని సిఎం చంద్రబాబు అభినందించారు. పోలీసులకు, హోంగార్డులకు ఏం తేడా లేదని, రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులను, పోలీసులకు వేరుగా చూడటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
ఇటీవలే తమపై వరాల జల్లు కురిపించిన సిఎంకు కృతజ్ఞతగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన హోంగార్డుల ఆత్మీయ అభినందన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది సన్మాన సభ కాదు...హోంగార్డుల చైతన్య సభ అని వ్యాఖ్యానించారు.
హోంగార్డులకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత తనదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. క్రమశిక్షణకు హోంగార్డులు మారుపేరుగా ఉన్నారని అభినందించారు. క్షేత్రస్థాయిలో పనిచేసేవారి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందన్నారు. ఎక్కడ సెక్యూరిటీ సమస్య ఉంటే అక్కడ హోంగార్డులు పనిచేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో రౌడీయిజం ఉండటానికి వీల్లేదని చంద్రబాబునాయుడు అన్నారు.
Recommended Video
కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థ సహకరిస్తే మొట్టమొదటగా హోంగార్డులనే ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. శాంతి భద్రతలను కాపాడటంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలని ఈ సందర్భంగా సీఎం పోలీసుశాఖకు సూచించారు.