జగన్! మా వాళ్లతో వైయస్ ఓటు వేయించారు, అప్పుడేమైంది: రాష్ట్రపతికి ఫిర్యాదుపై చంద్రబాబు
ఏపీలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడంపై వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ గురువారం రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ధీటుగా స్పందించారు.
అమరావతి: ఏపీలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడంపై వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ గురువారం రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ధీటుగా స్పందించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎవరూ మాట్లాడలేదేం అని అడిగారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇతర పార్టీల వారిని కాంగ్రెస్లోకి తీసుకెళ్లారని, అవి ఫిరాయింపులు కావా అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.
జగన్ రాష్ట్రపతిని కలిసి ఫిరాయింపులపై ఫిర్యాదు చేసిన టిడిపి సమన్వయ కమిటీ భేటీలో చర్చకు వచ్చింది. మంత్రులు, కార్యదర్శులతోను సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
వైయస్ ప్రోత్సహించారుగా
అణు ఒప్పందంపై లోకసభలో ఓటింగ్ జరిగినప్పుడు కాంగ్రెస్ బహిరంగంగా ఫిరాయింపుల్ని ప్రోత్సహించిందన్నారు. నాటి సీఎం వైయస్ టిడిపి ఎంపీలు ఆదికేశవులు నాయుడు, మందా జగన్నాథంలను కాంగ్రెస్లోకి తీసుకుని తమ పార్టీకి ఓటు వేయించారని, ఆ తర్వాత ఆదికేశవులుకు టిటిడి చైర్మన్ పదవి ఇచ్చారన్నారు.
వారు రాజీనామా చేయలేదు
వారెవరూ తమ పదవులకు రాజీనామాలు చేయలేదు. వైయస్ రెండోసారి సీఎం కాగానే టిడిపి ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రె డ్డి, వై బాలనాగి రెడ్డిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారని, వా రూ రాజీనామాలు చేయలేదన్నారు. ఇప్పుడు వేస్తున్న ప్రశ్నలు అప్పుడెందుకు వేయలేదని నిలదీశారు.
కొన్ని రాజకీయ నిర్ణయాలు
ప్రభుత్వానికి రాజకీయ అజెండా కూడా ముఖ్యమని, దాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రులు, అధికారులు సమష్టిగా పని చేయాలని చంద్రబాబు సూచించారు. పరిపాలనతో పాటు రాజకీయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందన్నారు.
ప్రభుత్వ ప్రగతి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యతంతా సంబంధిత మంత్రి, కార్యదర్శులదేనని స్పష్టం చేశారు. గురువారం మంత్రివర్గ సమావేశం, అనంతరం జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలోనూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి మంత్రి చూసే శాఖపై ప్రతి నెలా సమీక్షిస్తానని చంద్రబాబు చెప్పారు. ఏ మంత్రి వద్ద ఎన్ని శాఖలుంటే సమీక్ష కూడా అన్ని గంటలు ఉంటుందన్నారు.
నేను చంద్రబాబు.. అధికారులకు పరిచయం
ముఖ్యమంత్రి సమన్వయ కమిటీ సమావేశంలో, మంత్రివర్గ సమావేశంలోనూ ఉల్లాసంగా కనిపించారు. మొదట మంత్రివర్గ సమావేశం ముగిశాక కార్యదర్శులను పిలిచారు. మంత్రివర్గంలో కొత్త సభ్యులు ఉండటంతో మంత్రులు, కార్యదర్శులను ఎవరికి వారు పరిచయం చేసుకోవలసిందిగా సూచించారు.
మొదట చంద్రబాబు చొరవ తీసుకుని.. తన పేరు చంద్రబాబు అని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అని పరిచయం చేసుకున్నారు. దీంతో సమావేశంలో ఉన్న వారు నవ్వేశారు. తర్వాత వరుసగా మంత్రులు, కార్యదర్శులు పరిచయం చేసుకున్నారు.
శివనాడర్ వచ్చినప్పుడు..
కొద్ది రోజుల క్రితం విజయవాడకు వచ్చిన హెచ్సీఎల్ అధినేత శివనాడార్ తిరిగి వెళ్లేటప్పుడు తానే స్వయంగా తన కారులో విమానాశ్రయంలో దించి వచ్చానని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు మంత్రులు, కార్యదర్శులు కూడా అదే నిబద్ధతతో పని చేయాలని చెప్పారు. హీరో సంస్థకు భూకేటాయింపు అంశం చర్చకు వచ్చినప్పుడు గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన వోక్స్ వ్యాగన్ ఉదంతాన్ని గుర్తు చేశారు. మనం అప్రమత్తంగా ఉండాలనడానికి ఇది నిదర్శనమన్నారు.
కలెక్టర్లను చూసి ఆశ్చర్యపోయిన చంద్రబాబు
మంత్రులు, కార్యదర్శులతో సమావేశం ముగింపు దశకు వచ్చేసరికి అన్ని జిల్లాల కలెక్టర్లు వీడియోకాన్ఫరెన్స్ తెరలపై కనిపించారు. అప్పటి వరకు వాళ్లంతా కాన్ఫరెన్స్లో ఉన్నారన్న విషయం తెలియని చంద్రబాబు... మీరు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. కార్యదర్శులు, విభాగాధిపతులతో సమీక్ష సమావేశాలు జరిగినప్పుడు జిల్లా కలెక్టర్లను కూడా కాన్ఫరెన్స్లోకి తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు.