పవన్ కళ్యాణ్ మొన్నటిదాకా మనతో;ఇప్పుడు మనల్నే: చంద్రబాబు
అమరావతి:పవన్ కళ్యాణ్ ట్వీట్ల యుద్దంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఏప్రిల్ 20 తేదీన సిఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష ప్రారంభం రోజు నుంచే పవన్ కళ్యాణ్ ట్వీట్లు ప్రారంభం కాగా ఆ వ్యవహారంపై పరోక్షంగానే తప్ప నేరుగా స్పందించని చంద్రబాబు మంగళవారం డైరెక్టుగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించే మాట్లాడారు.
Recommended Video
తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడిలో జరిగిన సభలో మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్,కేంద్రం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టీడీపీ ఎన్నడూ విమర్శించలేదని... ఎదుటివారి మీద బురద చల్లే అలవాటు తెలుగుదేశం పార్టీకి లేదని సిఎం చంద్రబాబు అన్నారు. మొన్నటిదాకా మనతోనే ఉన్న ఆయన ఇప్పుడు మనల్నే విమర్శిస్తున్నారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎప్పుడూ ఎవరిపైనా విమర్శలు చేయలేదని...కేవలం సమస్యలపైనే పోరాడానని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.
పవన్ ను ఉద్దేశించి...మాట్లాడిన సిఎం
టిడిపి, ఆ పార్టీ మద్దతు టివి ఛానెళ్లంటూ వాటిపై ట్వీట్ల యుద్దం చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా స్పందించారు. ధర్మపోరాట దీక్ష వేదికపైన పవన్ కల్యాణ్ తన దీక్షను పక్కదోవ పట్టించే యత్నం చేశారని ఆరోపిస్తూ ఆయనకు పరోక్షంగా చురకలు అంటించిన చంద్రబాబు తాజాగా పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించే మాట్లాడారు. తమ పార్టీ పవన్ కళ్యాణ్ ను ఎన్నడూ విమర్శించలేదని,ఎదుటివారి మీద బురద చల్లే అలవాటు టిడిపికి లేదని అన్నారు. అంతేకాదు మొన్నటిదాకా మనతోనే ఉన్న ఆయన ఇప్పుడు మనల్నే విమర్శిస్తున్నాడంటూ...పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలం వరకు తమకు మద్దతుగా ఉన్న విషయాన్ని సిఎం చంద్రబాబు బైటపెట్టారు.
సిఎం...ఇంకా ఏమన్నారంటే
కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతూ "మనల్ని ఎన్ని విధాల ఆడించాలో అన్ని విధాలా ఆడిస్తోందని, ఇబ్బందులు పెడతారు, సమస్యలు సృష్టిస్తారు. ఐదు కోట్ల మంది ఐక్యతగా ఉంటే.. కేంద్రం ఆటలు సాగవు. 29 సార్లు దిల్లీకి వెళ్లా, ఎప్పుడూ రాజీ పడలేదు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇందిరాగాంధీ నుంచి రాజశేఖర్రెడ్డి వరకూ నన్నేమీ చేయలేకపోయారు. నిజాయితీగా ఉన్నందునే నన్నేమీ చేయలేకపోయారు. గతంలో ఇలాగే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ బర్తరఫ్ చేసిందని...అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీకి తెలుగువారు బుద్ధి చెప్పారని...తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనని"... చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కూడా ఇదే పని చేస్తోందని ఆయన విమర్శించారు.
నిజాయితీగా...ఉన్నందునే...ఏమీచేయలేకపోయారు
నిజాయితీగా ఉన్నందునే నన్నేమీ చేయలేకపోయారు. నేనెవరికీ భయపడను.. తప్పు చేసిన వారెవ్వరినీ వదలను. దేశంలో ఎస్సీలకు భద్రత లేదు, మహిళలకు రక్షణ లేదు. బ్యాంకులు దోచుకుని విదేశాలకు వెళ్లినవారిపై ఎందుకు చర్యలు లేవు? అవినీతి పరులను ప్రధాని తన కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత భాజపాకు లేదా? నేనేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని..విభజన హామీలే నెరవేర్చమంటున్నానని చంద్రబాబు అన్నారు.
ప్రజలకు...చంద్రబాబు వినతి
కేంద్రంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలంతా ఒక కన్నేసి ఉంచాలని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొందరు అడ్డదారుల్లో ముందుకు వెళ్లడంలో సిద్ధహస్తులని...స్వతహాగా గెలవడం చేతకానివారు, దొడ్డిదారులను చూసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ఆ వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రధాని మోడీ నెరవేర్చాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అందుకోసమే ఈనెల 30న తిరుపతిలో సభ నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు.