ఆ రోజు కంటే సంతోషంగా ఉంది: చంద్రబాబు, జగన్కు కౌంటర్
అమరావతి: తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు అన్నారు. ఆయన ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలో నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం చరిత్రాత్మకమన్నారు. పట్టిసీమ అసాధ్యమని కొందరు పందేలు కాశారని, మరికొందరు రాజకీయ సన్యాసం చేస్తామంటూ సవాల్ చేశారని, వారందరికీ పట్టిసీమ ప్రారంభంతో కనువిప్పు కలగాలని వైసిపిని ఉద్దేశించి అన్నారు.
అసాధ్యమనుకున్న పట్టిసీమ ఎత్తిపోతలను తమ ప్రభుత్వం సుసాధ్యం చేసిందన్నారు. పట్టిసీమ ద్వారా 8,500 క్యూసెక్కుల నీటిని కృష్ణా నదికి అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు. గతేడాది 9 టీఎంసీల నీటిని కృష్ణా నదికి మళ్లించి.. కృష్ణా డెల్టా కింద వేలాది ఎకరాల పంటను కాపాడగలిగామన్నారు. ఎత్తిపోతల పథకం 24 పంపుల నిర్మాణం పూర్తికావడంతో ఇవాళ అధికారికంగా నీటిని విడుదల చేశారు.