గవర్నర్ మార్పుపై నేను స్పందించను..అదంతా బిజెపి వ్యవహారం:సిఎం చంద్రబాబు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ మార్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన అభిప్రాయం వెల్లడించారు. ఇంతవరకు ఈ విషయం గురించి మాట్లాడని చంద్రబాబు తొలిసారిగా ఈ అంశంపై స్పందించారు. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశం అనంతరం చంద్రబాబు ఈ విషయమై మాట్లాడారు.
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా వచ్చిన నరసింహన్ ఆ తరువాత తెలంగాణ వేరుపడ్డాక కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే గవర్నర్ ఏపీ పట్ల వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు ఈమధ్య కాలంలో జోరందుకున్నాయి. ముఖ్యంగా గవర్నర్ పై నేరుగా పలు విమర్శలు చేసిన బిజెపి నేతలు కేవలం విమర్శలు,ఆరోపణలకే పరిమితం కాకుండా ఏకంగా గవర్నర్ను మార్చాలనే డిమాండ్ను తెరమీదకే తెచ్చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి స్పందించారు.
తొలిసారి...సిఎం స్పందన..
గవర్నర్ మార్పు అంశంపై సీఎం చంద్రబాబు మొదటిసారి తన అభిప్రాయం వెల్లడించారు. 'గవర్నర్ మార్పుపై ముఖ్యమంత్రిగా నేను స్పందించను. ఎంపీ హరిబాబు రాసిన లేఖ...వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని చంద్రబాబు కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వివిధ అంశాల గురించి తెలిపారు.
సూటిగా...స్పష్టంగా...చెప్పేసిన చంద్రబాబు...
దీంతో ఈ విషయం తన వైఖరి, తమ పార్టీ వైఖరి ఏంటో మరో ఆలోచనకుతావివ్వకుండా...సూటిగా...స్ఫష్టంగా...తేల్చిచెప్పేశారు. దీంతో గవర్నర్ మార్పు అంశంపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో అని ఇప్పటివరకు ఎదురుచూసిన వివిధ రాజకీయ పక్షాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానంతో స్పష్టత లభించినట్లయింది.
జైట్లీతో...సమావేశం గురించి...
విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సుకు అరుణ్ జైట్లీని ఆహ్వానించానని సిఎం చంద్రబాబు చెప్పారు. అలాగే ప్రత్యేక ప్యాకేజీ, రెవెన్యూ లోటు భర్తీ అంశాలపై ఆయనతో చర్చించానని తెలిపారు. ఈఏపీ ద్వారా కాకుండా నాబార్డు, హడ్కో ద్వారా నిధులు ఇవ్వాలని కోరామని అన్నారు. రెవెన్యూ లోటు కింద ఆంధ్రప్రదేశ్కి ఇంకా నిధులు రావాల్సి ఉన్నాయని చెప్పారు.
మరోవైపు...బిజెపి...టార్గెట్...గవర్నర్...
గత కొంతకాలంగా గవర్నర్ తీరుపై బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన్ని బాహాటంగా విమర్శించడమే కాకుండా కేంద్రానికి ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరికలు కూడా చేశారు. ఏపీ ప్రభుత్వం రూపొందించిన నాలా బిల్లు విషయంలో గవర్నర్ తీరుపై విష్ణుకుమార్రాజు ఘాటు విమర్శలు, ఆరోపణలు చేశారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు కొత్త గవర్నర్ను నియమించాలని ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్రాజు డిమాండ్ చేశారు.
ఇంతలోనే...ఎపి బిజెపి ఎంపి లేఖ...
ఈ నేపథ్యంలోనే ఏపీకి కొత్త గవర్నర్ను నియమించాలంటూ ఎంపీ కంభంపాటి హరిబాబు కేంద్రాన్ని కోరుతూ లేఖ రాయడం కలకలం సృష్టించింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు రాసిన లేఖలో సొంతగడ్డపై నుంచే పాలన జరగాలన్న ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం చంద్రబాబు సచివాలయం, శాసనసభ, మండలి, ఇతర ప్రభుత్వ శాఖలను హైదరాబాద్ నుంచి అమరావతికి చాలాకాలం క్రితమే తరలించారని హరిబాబు పేర్కొనడం జరిగింది. అయితే రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న గవర్నర్ నరసింహన్ హైదరాబాద్లోనే విధులు నిర్వహిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా గవర్నర్ను నియమించాలన్నది ప్రజల ఆకాంక్ష అని, దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని హరిబాబు తన లేఖలో కోరడం గమనార్హం.