జాతీయ నేతలు జగన్ క్రెడిబిలిటీని పెంచుతున్నారా? జగన్ ను తిట్టట్లేదెందుకు? చంద్రబాబులో అంతర్మథనం
అమరావతి: ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి జాతీయ స్థాయి నాయకులను రాష్ట్రానికి రప్పించుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో అంతర్మథనం మొదలైంది. కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా వంటి జాతీయ స్థాయి నాయకులను ఎన్నికల్లో ప్రచారానికి పిలిపించుకున్నందు వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఫరూక్ అబ్దుల్లాను పక్కన పెడితే..మమతా బెనర్జీ గానీ, కేజ్రీవాల్ గానీ తన ప్రధాన శతృవు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట ఎందుకు అనట్లేదనే అనుమానాలు టీడీపీ నేతల్లో వ్యక్తమౌతున్నాయి.
జాతీయ నాయకుల పర్యటనల వల్ల లాభం కంటే నష్టమేనా?
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఒంటరిగా పోటీలో ఉన్నప్పటికీ.. జాతీయ స్థాయి నాయకుల అండదండలను తీసుకుంటున్నారు. తాను నరేంద్రమోడీని ఎంతగా వ్యతిరేకిస్తున్నాననే విషయాన్ని చాటి చెప్పడానికి వారి రాక ఉపయోగపడుతుందని చంద్రబాబు భావించారు. దీనితో పాటు జాతీయ నాయకుల నోటి నుంచి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయించడం వల్ల రాజకీయంగా లబ్ది పొందవచ్చని వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. తొలుత- జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ద్వారా ముస్లింల ఓటుబ్యాంకు అధికంగా ఉన్న కడప జిల్లాలో ప్రచారం చేయించారు. కడపలో పర్యటించిన ఫరూక్ అబ్దుల్లా.. జగన్ పై ఒకట్రెండు ఆరోపణలు చేశారు గానీ..అవి పెద్దగా ప్రభావం చూపలేదు.
రూ.1500 కోట్లు ఇస్తానన్న జగన్ అంటూ ఆరోపణ
తన ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఫరూక్ అబ్దుల్లా ప్రతిపక్ష నేతను టార్గెట్ గా చేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్నుమూసిన వెంటనే.. జగన్ తన వద్దకు వచ్చారని, ముఖ్యమంత్రిగా చేస్తే, 1500 కోట్ల రూపాయల ముడుపులు ఇస్తానని తనతో బేరం చేయించినట్లు ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. ఈ ఆరోపణలు జనంపై పెద్దగా ప్రభావాన్ని చూపిన దాఖలాలు లేవు. పైగా అవి బూమరాంగ్ కూడా అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ సైతం దీన్ని ఖండించింది. దీనితో ఈ వ్యూహం కాస్తా తుస్సుమన్నదనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమయ్యాయి.
మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లపై ఆశలు
దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, విద్యావంతునిగా గుర్తింపు ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లపై చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. వారిని రాష్ట్రానికి పిలిపించుకున్నారు. కేజ్రీవాల్ రెండుసార్లు మన రాష్ట్రానికి వచ్చారు. విశాఖపట్నంలో భారీ ఎత్తున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మమతా బెనర్జీ, కేజ్రీవాల్ పాల్గొన్నారు. షరామామూలే అన్నట్టు వారిద్దరు కూడా ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారే తప్ప.. జగన్ ఊసే ఎత్తలేదు. పొరపాటున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరునైనా ఉచ్ఛరించట్లేదు. ఈ వ్యవహారం చంద్రబాబులో అంతర్మథనానికి దారి తీసినట్లు చెబుతున్నారు.
చంద్రబాబును నమ్మట్లేదా?
జాతీయ స్థాయి నాయకులు చంద్రబాబు పూర్తిస్థాయిలో భరోసా ఉంచకపోవడమే దీనికి కారణమై ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు- కేజ్రీవాల్ కు గానీ, మమతా బెనర్జీకి గా.. జగన్ ను విమర్శించడం వల్ల వచ్చే అదనపు రాజకీయ లబ్ది ఏమీ ఉండదు. పైగా- ఎప్పుడూ అధికారంలో లేని ఓ ప్రాంతీయ పార్టీ నాయకుడిని విమర్శించడం వల్ల తమ స్థాయి తగ్గుతుందనే వారు భావించి ఉండొచ్చని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో 21 విపక్ష పార్టీల ఉమ్మడి లక్ష్యం ఒక్కటే- అదే నరేంద్రమోడీ. ఆ లక్ష్యాన్ని ఛేదించడానికే ప్రస్తుతం వారు తమ దృష్టిని కేంద్రీకరించారని, జగన్ వంటి ప్రాంతీయ స్థాయి నాయకుడిపై విమర్శలు గుప్పించడం వల్ల తమ లక్ష్యం నెరవేరదని కేజ్రీవాల్ గానీ, మమతా గానీ బలంగా నమ్ముతున్నారని చెబుతున్నారు. చంద్రబాబు తరఫున ప్రచారానికి రావడానికి సిద్ధపడిన దేవేగౌడ లేదా స్టాలిన్ వంటి నేతలు కూడా తమ ఉమ్మడి శతృవైన మోడీనే టార్గెట్ గా చేసుకుంటారే తప్ప జగన్ జోలికి వెళ్లకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
చంద్రబాబు పరిస్థితి వేరు..
దేశ రాజకీయాల సంగతి పక్కన పెడితే.. రాష్ట్రస్థాయిలో చంద్రబాబు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. చంద్రబాబు ప్రధాన శతృవు మోడీ అని అనుకోవడానికి ఎంతమాత్రమూ వీల్లేదు. చంద్రబాబు ప్రధాన టార్గెట్ వైఎస్ జగన్. జగన్ ను ఎంతగా విమర్శిస్తే.. అంతగా తనకు రాజకీయ లబ్ది కలుగుతుందని ఆయన నమ్ముతున్నారు. అందుకే కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి, జాతీయ స్థాయి నాయకులను ప్రచారానికి పిలుస్తున్నారు గానీ.. అది సత్ఫలితాలను మాత్రం ఇవ్వట్లేదు. ఈ వ్యవహారం చంద్రబాబులో అసహనానికి దారి తీసిందని అంటున్నాయి పార్టీ శ్రేణులు.