పుష్కరాల నిర్వహణ క్రెడిట్: చంద్రబాబు ఇలా, కేసీఆర్ అలా?
అమరావతి: కృష్ణా పుష్కరాలు మంగళవారంతో పూర్తవుతాయి. ఆగస్టు 12న ప్రారంభమైన కృష్ణా పుష్కరాలు ఈరోజు వరకు నిర్విఘ్నంగా సాగాయి. ఆంధ్రప్రదేశ్లో పుష్కర ఏర్పాట్లు బాగున్నాయని, పుష్కర స్నానానికి వచ్చిన భక్తులంతా తెగ మెచ్చుకుంటున్నారు. పుష్కర ఏర్పాట్లపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిసిన సీఎం చంద్రబాబు చాలా సంతోషంగా ఉన్నారు.
ఎందుకంటే పుష్కర స్నానానికి వచ్చిన భక్తులు ప్రభుత్వాన్ని గాక చంద్రబాబే ఈ ఏర్పాట్లన్నీ అద్భుతంగా చేశారని చెపుతుండటమే. ప్రజల నుంచి అలాంటి పొగడ్త లేదా మెప్పు కోసమే అన్నీ తానై పుష్కరాలు నిర్వహించారనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదే గనుగ నిజమైతే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబుకే దక్కుతుంది.
ఈ విషయంలో క్రెడిట్ను చంద్రబాబు ఒక్కడే తీసుకోకుండా పుష్కరాలపై సంతోషం వ్యక్తం చేస్తూ సోమవారం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో సిబ్బంది, పోలీసులకి ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన ఈ రెండు రోజులు కూడా అందరూ పూర్తి అప్రమత్తంగా మెలగాలని సూచించారు.
అంతేకాదు కృష్ణా పుష్కరాలని సమర్ధంగా నిర్వహించడం వల్ల ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని కూడా అన్నారు. తొలి రెండు రోజులు పుష్కరాలపై దుష్ప్రచారం చేయాలనుకొన్న వారి నోళ్ళు మూతపడేలాగా అందరూ కలిసి చాలా అద్భుతంగా పుష్కరాలని నిర్వహించారని అధికారులని, సిబ్బందిని మెచ్చుకున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే ఈ వ్యాఖ్యలు వైసీపీ అధినేత వైయస్ జగన్ను ఉద్దేశించే చేశారని అనుకోవాలి. సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా చంద్రబాబు తన పుష్కరాలు జరిగిన తీరుపైనే ప్రధానంగా చర్చిస్తారనే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
పుష్కరాలను సమర్ధవంతగా నిర్వహించామని ప్రజలకు తెలిసేలా ఈ అసెంబ్లీ సమావేశాలను వినియోగించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. గోదావరి పుష్కరాల మాదిరి కాకుండా కృష్ణా పుష్కరాలను నభూతో నభవిష్యత్ అన్నట్లుగా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారనేది ఒప్పుకోవాలి.
ఒకటి రెండు మినహాయించి పుష్కరాల్లో ఎలాంటి విషాదకర సంఘటనలు చోటు చేసుకోకపోవడం గమనార్హం. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, అధికారులు, సిబ్బంది, వివిధ స్వచ్చంద సంస్థలని మనస్ఫూర్తిగా అభినందించాలి. తెలంగాణా ప్రభుత్వం కూడా కృష్ణా పుష్కరాలు నిర్వహించింది.
అయితే ఏపీలో సీఎం చంద్రబాబు మాదిరి కాకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పుష్కరాల నిర్వహణ బాధ్యతని తన మంత్రులు, ఉన్నతాధికారులకే వదిలిపెట్టి పైనుంచి పర్యవేక్షణకే పరిమితం అయ్యారు. తెలంగాణలో కూడా పుష్కర స్నానమాచరించిన భక్తులు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు బాగున్నాయని మెచ్చుకొంటున్నారు.
తెలంగాణలో మాత్రం పుష్కరాల క్రెడిట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ అందరిదిగా భావిస్తుంటే, ఏపీలో చంద్రబాబు నాయుడు ఆ క్రెడిట్ పూర్తిగా తానే స్వంతం చేసుకొంటున్నారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఉందని విపక్ష నేత వైయస్ జగన్ గతంలో పలుమార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే.