పవన్ కళ్యాణ్తో రేపు చంద్రబాబు భేటీ: రాజధానికి ఆగని భూసేకరణ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నష్టనివారణ చర్యలకు నడుం బిగించారు. చంద్రబాబునాయుడు రేపు (ఆదివారం) జనసేన అధినేత పవన్కల్యాణ్తో భేటీ కానున్నారు.
భూసేకరణ తదితర అంశాలను చంద్రబాబు పవన్కల్యాణ్కు వివరించే అవకాశం ఉంది. శనివారం సాయంత్రం రాత్రి విజయవాడ నుంచి చంద్రబాబు హైదరాబాద్కు రానున్నారు. శనివారం ఉదయం చంద్రబాబు పార్టీ నాయకులతో విజయవాడలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల కమిటీల ఏర్పాటు కోసమే కాకుండా భాసేకరణ, కార్యాలయాల తరలింపు తదితర అంశాలపై ఆయన సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
రైతులు సహకరించాలి...
కాగా, ఎపి రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదు. రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణకు రైతులు సహకరించాలని మంత్రి నారాయణ విజ్ఝప్తి చేశారు. భూసమీకరణకు రైతులంగా సహకరిస్తే 2019కి మంచి రాజధానిని నిర్మించుకుంటామన్నారు. రాజధాని వల్ల పరిసర ప్రాంతాల వారి ఆర్థికస్థితి పెరుగుతుందని తెలిపారు. భూసమీకరణ ఈ విషయంలో విపక్షాలు రాద్దాంతం చేయడం మానుకోవాలని సూచించారు.
నోటీసులు జారీ చేస్తాం..
రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని వారికి నోటీసులు జారీ చేస్తామని మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. రాజధాని నిర్మాణానికి రైతులు సహకరించాలని కోరారు. ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు రూ.65కోట్లు అవసరమని మంత్రి చెప్పారు.
రెండు రాష్ర్టాల్లో పార్టీ కమిటీల ఏర్పాటు, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు టీడీపీ సమావేశం ఏర్పాటు చేశామని మంత్రి ప్రత్తిపాటి వివరించారు. వైసీపీకి పట్టున్న గ్రామాల్లో భూములు ఇవ్వకుండా వైఎస్ జగన్ రైతులను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు.
గ్రామ కంఠాల ఖరారుకు నోటిఫికేషన్
రాజధాని గ్రామాల్లో గ్రామకంఠాలను ఖరారు చేసి భూసేకరణకు నోటిఫికేషన్ను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాజధానిలో భూసేకరణ నోటిఫికేషన్ను విడుదల చేయలేదు. కొరగల్లు, నవులూరు-1, నవులూరు-2, కృష్ణాయపాలెంలలో భూసమీకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు.
న్యాయసలహా మేరకు నోటిఫికేషన్కు ముందు అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. సీఎంతో జరిగిన సమావేశంలో ఉన్నతాధికారుల సూచనల ప్రకారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.