చంద్రబాబు..ఎగ్జిట్పోల్స్కు ముందు, ఎగ్జిట్పోల్స్ తరువాత! అయిననున్ పోయిరావలె!
Recommended Video
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ప్రతిపక్షాల ఆశలు, అంచనాలను తలకిందులు చేశాయి. సొంతంగా అధికారంలోకి రాకపోయినప్పటికీ.. భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని అధికారానికి దూరం చేయగల స్థానాలను చేజిక్కించుకుంటామని కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు వేసుకున్న అంచనాలు దారుణంగా దెబ్బతిన్నట్టే కనిపిస్తోంది ఎగ్జిట్ పోల్స్ను బట్టి చూస్తోంటే.
ఎన్డీఏతో సంబంధం లేకుండా బీజేపీ ఒక్కటే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలను సాధించుకుంటుందని అంటూ ఎగ్జిట్ పోల్స్ తేటతెల్లం చేశాయి. ఇవే అంచనాలు, ఇవే ఫలితాలు గనక ఈ నెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడితే- ఆ తరువాతి పరిస్థితేమిటనేది దేశవ్యాప్తంగా 21 ప్రతిపక్ష పార్టీలకు మింగుడు పడని విషయంగా మారింది. ఈ పరిస్థితుల్లో బీజేపీ, సహా ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలను నిలువరించడానికి కసరత్తు కొనసాగుతూనే ఉంది.
మోడీ గుడికెళ్ళారని, మీడియా ప్రచారం చేసిందని చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు
దీనికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తినకు వెళ్లబోతున్నారు. అనంతరం- ఆయన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆయన మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకుని రావడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు.
ఎగ్జిట్ పోల్స్కు ముందు..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 ప్రతిపక్షాల పరిస్థితి ఎగ్జిట్ పోల్స్కు ముందు.. ఎగ్జిట్ పోల్స్కు తరువాత అన్న చందంగా మారింది. బీజేపీయేతర పక్షాలన్నీ ఒకే గొడుగు కిందికి తీసుకుని రావాలని, తద్వారా కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది చంద్రబాబు వ్యూహం. దీనికోసం ఆయన ఇప్పటికే- బీజేపీయేతర పార్టీల నాయకులతో ఓ రౌండ్ సమావేశాలను పూర్తి చేశారు. ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీని మట్టి కరిపించడానికి మహాకూటమి కట్టిన సమాజ్ వాది పార్టీ, బహుజన్ సమాజ్వాది పార్టీల అధినేతలతో భేటీ అయ్యారు. మయావతి, అఖిలేష్ యాదవ్లతో వేర్వేరుగా సంప్రదింపులు జరిపారు. మమతా బెనర్జీతోనూ పలుమార్లు మంతనాలు నిర్వహించారు.
ఎగ్జిట్పోల్స్ తరువాత..
ఎగ్జిట్ పోల్స్ వెలువడటానికి ముందు ఉన్నంత వేడి ఆ తరువాత కనిపించట్లేదనే చెప్పుకోవచ్చు. వరుసగా రెండోసారి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందేమోననే ఆందోళన ప్రతిపక్ష నేతల్లో కనిపిస్తోంది. అయినప్పటికీ- 23వ తేదీ నాడు వెలువడే అసలు ఫలితాలపై ఆశలు పెట్టుకున్నారు. ఓటర్ల నిజమైన పల్స్ ఏమిటనేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమై ఉందని ఆశిస్తున్నారు. నిజానికి- కాంగ్రెస్కు భారీ పరాభవం తప్పదంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఆ పార్టీ 120 నుంచి 130 స్థానాలకే పరిమితం కావచ్చని నిర్ధారించాయి. ఈ పరిస్థితుల్లో 23వ తేదీ నాడు వెలువడే ఫలితాలు కొంత మేర పెరగొచ్చేమో గానీ.. కాంగ్రెస్ పార్టీని అధికారానికి చేరువ చేసేంత స్థాయికి తీసుకెళ్లగలవని లెక్కలు వేసుకోవడం అత్యాశే అవుతుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.
చంద్రబాబు మరోసారి
ఈ పరిస్థితుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏమిటనేది రూపొందించుకునే పనిలో పడ్డాయి ప్రతిపక్ష పార్టీలు. ఇందులో భాగంగా- ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి దేశ రాజధానిలో చక్కర్లు కొట్టబోతున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలను కలుసుకోబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు మమతా బెనర్జీతోనూ భేటీ అవుతారు. అధికారం అందకపోతే- బలమైన ప్రతిపక్షంగా, వచ్చే అయిదేళ్ల పాటు మోడీ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు కనిపిస్తోంది.