చంద్రబాబు: సీఎం అని రాసి..దాన్ని కొట్టేసి! ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా 21 ప్రతిపక్ష పార్టీల నాయకులు మంగళవారం మధ్యాహ్నం దేశ రాజధానిలో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను కలుసుకున్న సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. 21 ప్రతిపక్ష పార్టీల నాయకులు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాకు అందజేసిన వినతిపత్రంలో చంద్రబాబు చేసిన సంతకం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ఈ వినతిపత్రంపై 21 ప్రతిపక్ష పార్టీల తరఫున ఆయా పార్టీల నుంచి ప్రాతినిథ్యం వహించిన నాయకులు సంతకాలు చేశారు. ఇందులో మొదటి సంతకాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి గులాం నబీ ఆజాద్ చేశారు. తన పేరు, పార్టీ పేరును ఆయన పొందుపరిచారు. ఆ తరువాత రెండో సంతకం చంద్రబాబు నాయుడిది. తన పేరు రాసిన చంద్రబాబు.. ఎదరుగా ఉన్న కాలమ్లో తొలుత సీఎం అని ఆంగ్లంలో రాశారు. ఆ తరువాత ఆయన ఏమనుకున్నారో, ఏమో దాన్ని కొట్టేశారు. టీడీపీ అని ఆంగ్లంలో రాశారు.
నిజానికి అక్కడ- హోదాలతో అవసరం లేని సందర్భం అది. రాజకీయ నాయకుడి పేరు, ఏ పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారనే విషయాన్ని ఆ వినతిపత్రంలో పొందుపరిస్తే సరిపోతుంది. చంద్రబాబు నాయుడు కంగారులో సీఎం అని రాసి, అనంతరం దాన్ని కొట్టేశారు. టీడీపీ తరఫున ఈ సమావేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు రాసుకొచ్చారు. ఇప్పుడు ఆ కొట్టివేతే సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారి తీసింది.
చంద్రబాబు తాను మాజీ అని అప్పుడే గ్రహించారని అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఫలితాలు రావడానికి ఇంకా 48 గంటల సమయం ఉందని, అప్పుడే ఆయన మాజీ అయ్యారా? అంటూ ఆశ్చర్యాన్ని వెల్లబోస్తున్నారు. ఈ నెల 23వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాల తరువాత జరిగబోయేదేమిటో చంద్రబాబుకు అప్పుడే తెలిసిపోయిందంటూ చెణుకులు విసురుతున్నారు.