ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం దసరా కానుక: ఈ నెల నుండే అమలు: ఉత్తర్వులు సిద్దం..!
ఏపీయస్ ఆర్టీసి ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ మరో వరం ప్రకటించారు. దసరా కానుకగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసి సిబ్బంది..కార్మిక సంఘాలు ఎంతో కాలంగా ఇదే డిమాండ్ పైన ప్రభుత్వంతో చర్చలు జరిపారు. తాజాగా ఆర్టీసి సిబ్బందిని ఇక నుండి ప్రభుత్వంలో రవాణా శాఖ ఉద్యోగులుగా తీసుకోవాలని..ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని భత్యాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, ఇప్పడు దీనికి కొనసాగింపుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పదవీ విరమణ వయసును సైతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల నుండి దీనిని అమలు చేయాలని సీఎం అదేశించారు. సీఎం ఆదేశాలతో ఉత్తర్వులు సైతం సిద్దం అవుతున్నాయి. ఈ రోజు లేదా రేపు దీనికి సంబంధించిన ఉత్తర్వులు అధికారికంగా జారీ కానున్నాయి.
వర్ల రామయ్యకు నోటీసులు ఇచ్చిన జగన్ సర్కార్ .. రాజీనామా చెయ్యండి .. లేదంటే
ఆర్టీసి ఉద్యోగులకు దసరా కానుక..
ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగుల్లాగే ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం కోసం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు సంస్థలో ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ పైన ముఖ్యమంత్రికి సూచనలు చేసారు. అదే సమయంలో కార్మిక సంఘాలు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న పదవీ వరమణ వయసు పెంపు అంశం పైనా చర్చకు వచ్చింది. ఇప్పటికే ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకుంది. వచ్చే జనవరి నుండి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్గించాలని నిర్ణయించారు. దీంతో..వారికి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో అన్ని వేతనాలు..భత్యాలు ఇస్తున్న సమయంలో అదే విధంగా పదవీ విరమణ వయసును సైతం పెంచాలని సీఎం సూచించారు. దీంతో..ముఖ్యమంత్రి వారికి దసరా కానుకగా పదవీ విరమణ వయసు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
విలీన నివేదిక వచ్చే వరకూ రిటైర్ అవ్వరు
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు ఉత్తర్వులు సిద్దం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల నుండి అమలు చేయనున్నారు. విలీన కమిటీ నివేదిక ఇచ్చేవరకు వేచి చూడకుండా 60 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశింశారని తెలిసింది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచే ఇది అమల్లోకి వచ్చేలా జీవోలో పేర్కొంటారని సమాచారం. దీంతో విలీన కమిటీ రిపోర్టు వచ్చే వరకు మధ్యలో పదవీ విరమణ చేయాల్సిన వారంతా కొనసాగే అవకాశం ఉంది. ఇలాంటివారు రాష్ట్రవ్యాప్తంగా 550 మంది వరకు లబ్ధి పొందుతారని అంటున్నారు. అదే విధంగా సంస్థలో చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాలు కల్పిస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. నిబంధనల పేరుతో కొంత మంది ఉద్యోగుల పిల్లలను అనర్హులుగా ప్రకటించే అవకాశముందని చెప్పారు. ఈ నియామకాల్లో ఉద్యోగుల చనిపోయిన నాటికి ఉన్న వయసును పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
వేతన బకాయిలపైనా చర్చ..
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆర్టీసి కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చి ఉన్నాయి. ఆ సమయంలో వారితో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని హామీ ఇచ్చింది. అదే సమయంలో ఆర్టీసీ జేఏసీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ నెల 30న వేతన సవరణ బకాయిలు, నలభై శాతం అరియర్స్ను చెల్లించాలని ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) కోరుతోంది. 2017 ఏప్రిల్ ఒకటి నుంచి వేతన సవరణను అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు 2013 వేతన సవరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని అభ్యర్ధిస్తున్నారు. ఆర్టీసి వ్యవహారాల్లో పూర్తిగా సానుకూలంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.