పవన్ కళ్యాణ్, జగన్ హెచ్చరిక: రాజధానిపై గేరు మార్చిన బాబు!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిల హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అంశంపై మరో ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
నాలుగు రోజుల క్రితం జగన్, గురువారం నాడు పవన్ రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతుల ఆవేదనలను విన్నారు. ఈ సమయంలో వారిద్దరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో రాజధాని విషయంలో చంద్రబాబు మరింత తొందరపడుతున్నారని తెలుస్తోంది.
పవన్, జగన్ వంటి నేతలు రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, తద్వారా రాజధాని ఆలస్యమైతే ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్న చంద్రబాబు.. దానిని మరింత ముందుకు జరిపే ఆలోచన చేశారని తెలుస్తోంది.
ల్యాండ్ పూలింగ్ దాదాపు పూర్తయిందని చెప్పవచ్చు. ఇదే ఊపులో రాజధానికి త్వరలో శంకుస్థాపన చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం. తొలుత రాజధానికి జూన్లో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. అయితే, ఇది మరింత ముందుకు జరగనుంది. మేలోనే ఫౌండేషన్ స్టోన్ వేయనున్నారని తెలుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెలాఖరున చైనా పర్యటనకు వెళ్లవలసి ఉంది. అయితే, 30న అతను సింగపూర్ వెళ్లనున్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ఫైనల్ టచ్ విషయంలో సింగపూర్ ప్రతినిధులతో మాట్లాడనున్నారు. అనంతరం ఏప్రిల్ మొదటి వారంలో చైనా వెళ్తారని తెలుస్తోంది.
కేంద్రం సహకారం
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం కేంద్రం రూ.1000 కోట్లు, రూ.600 కోట్లు ఇస్తుందని చంద్రబాబు ఇటీవల కేబినెట్ సమావేశంలో చెప్పారని తెలుస్తోంది. కాగా, రాజధాని పైన చంద్రబాబు తొందరపాటుకు ముఖ్యంగా పవన్, జగన్ వంటి వారే కారణమని అంటున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులలో అనవసర ఆందోళన కల్పిస్తున్నారని, వారి ఆందోళనలు ఎక్కువ కాకముందే రాజధానికి శంకుస్థాపనం చేయాలని భావిస్తున్నారని సమాచారం.