అసోం సీఎం కు ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి .. ఏ విషయంలో అంటే
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న విషయం తెలిసిందే . నిన్నటికి నిన్న లాక్ డౌన్ కారణంగా నష్టపోతున్న మత్స్యకారులను ఆదుకునేందుకు మత్స్యకారుల లబ్ధిదారుల కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఇక తాజాగా చేపల ఎగుమతి మొదలైతే మత్స్య పరిశ్రమ నష్టాల నుండి గట్టెక్కుతుంది, మత్స్య కారుల కష్టాలు తొలుగుతాయి అని భావించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసోం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్కు ఫోన్ చేశారు.
అసోం సీఎంతో మాట్లాడిన సీఎం జగన్ ఏపీ నుంచి చేపల ఎగుమతికి ఉన్న అడ్డంకుల తొలగింపుపై దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఆక్వా ఉత్పత్తులు అసోంకు ఎగుమతి అవుతాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా తీవ్ర నష్టం జరిగిందని ఇక నష్ట నివారణా చర్యలు తీసుకోవాలని ఆయన అసోం సీఎం సహాయాన్ని కోరారు. అసోం సరిహద్దుల్లో లారీలు నిలిచిపోకుండా తగు చర్యలు తీసుకోవాలంటూ ఏపీసీఎం కోరారు. చేపల విక్రయాలను కూడా పునరుద్ధరించాలని అడిగారు .
చేపలు విక్రయించే మార్కెట్లను కూడా తెరవాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన అసోం సీఎం.. తగు చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి హామీ ఇచ్చారు. అలాగే లాక్డౌన్ కారణంగా ఏపీలో చిక్కుకుపోయిన అసోం వాసులకు తగిన సహాయాన్ని అందించాలని అసోం సీఎం కోరారు. ఇందుకు జగన్ స్పందిస్తూ ఏపీలో ఉన్న అసోం వాసులకు అన్ని రకాలుగా తోడుగా నిలుస్తున్నామని వైఎస్ జగన్ మాటిచ్చారు. లాక్ డౌన్ ఉన్నప్పటికీ ఒక్కొక్క రంగం మీద సడలింపులు ఇస్తున్న కేంద్రం ఆదేశాలతో ఏపీలో కూడా నిదానంగా వివిధ రంగాల వారికి లాక్ డౌన్ నుండి మినహాయింపు ఇస్తున్నారు . ఇక ఈ క్రమంలోనే ఆక్వా రంగాన్ని ఆదుకోవటానికి పరస్పర సహకారం కావాలని సీఎం జగన్ అసోం సీఎంతో మాట్లాడినట్టు తెలుస్తుంది.