ఎస్పీ బాలు చిరంజీవిగా వుంటారన్న జగన్; శివైక్యం చెంది ఏడాది, నమ్మశక్యంగా లేదన్న చంద్రబాబు
గాన గంధర్వుడు , సంగీత ప్రపంచంలో రారాజు తెలుగు సినీవినీలాకాశంలో ఒక వెలుగు వెలిగిన ధృవ తార ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ప్రధమ వర్ధంతి నేడు . తన గానంతో తెలుగు కళామతల్లికి సుగంధాలను అద్దిన ,సుస్వరాల రారాజు ఎస్పీ బాలసుబ్రమణ్యం మనకు దూరమై నేటికి ఏడాది. సరిగ్గా ఏడాది క్రితం గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తెలుగు సినీ వినీలాకాశంలో చెరగని సంతకం చేసి తన గాన మాధుర్యం తో అందరినీ అలరించి కరోనా మహమ్మారి కాటుకి బలైపోయారు. నేడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలుగు జాతి మొత్తం ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తోంది. ప్రముఖులు ఎస్.పీ.బాలును గుర్తు చేసుకుని, ఆయన గాన మాధుర్యాన్ని కొనియాడుతున్నారు.
ఈతరం కళాకారులు బాలు నుంచి స్ఫూర్తి పొందాలన్న వెంకయ్య నాయుడు
పిల్లలకు సంస్కారం నేర్పించాలని పిల్లల్లో సంస్కార బీజాలు నాటేందుకు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎంతగానో ప్రయత్నించారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన విశ్వ గాన గంధర్వ అంతర్జాతీయ సంగీత సమ్మేళనంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పై రూపొందించిన ప్రత్యేక పాటను ఆవిష్కరించారు. బాలు జీవితం సినీ సంగీత చరిత్రలో ఓ మైలురాయి లాంటిది ఆయన కొనియాడారు. బాలు వినమ్రత ఎందరికో ఆదర్శం అంటూ అభిప్రాయపడ్డారు. ఈతరం కళాకారులు యువత బాలు నుంచి స్ఫూర్తి పొందాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
ఎస్పీబీ అందరి హృదయాల్లో చిరంజీవిగా వుంటారన్న జగన్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం ని గుర్తు చేసుకున్నారు. మధుర గాయకులు, స్వరకర్త ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి. తన గాత్రంతో తెలుగు వారినే కాదు ఎన్నో భాషల్లో అశేష సంగీతాభిమానులను సంపాదించుకున్న ఎస్పీబీ అందరి హృదయాల్లో చిరంజీవిగా వుంటారని ట్వీట్ చేశారు ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి.
శివైక్యం చెంది ఏడాది అయిందంటే నమ్మాలనిపించడం లేదన్న చంద్రబాబు
ఇక తాజాగా ఎస్పీ బాలసుబ్రమణ్యం స్ఫూర్తికి నివాళులర్పిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రధమ వర్ధంతి నాడు ఆయనను గుర్తు చేసుకుంది. కరోనా మహమ్మారి తో సుదీర్ఘ పోరాటం చేసి అలసి గత ఏడాది సెప్టెంబర్ 25 వ తేదీన కోట్లాది మంది అభిమానులు కన్నీటి సాగరంలో ముంచి ఎస్పీ బాలసుబ్రమణ్యం వెళ్లిపోయారని, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి ,గానగంధర్వుడు అంటూ టిడిపి నివాళులర్పించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎస్పీబీని గుర్తు చేసుకున్నారు. గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించి అప్పుడే ఏడాది గడిచిపోయింది అంటూ పేర్కొన్న చంద్రబాబు నాయుడు మైమరపింపజేసే బాలు గారి మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉందని, అందుకే ఆయన శివైక్యం చెంది ఏడాది అయిందంటే నమ్మాలని అనిపించడం లేదని పేర్కొన్నారు.
పాట రూపంలో ఎప్పటికీ ఆయన మన హృదయాల్లో సజీవంగానే : లోకేష్
దివంగత ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ గానగంధర్వుడి స్మృతికి నివాళులర్పిస్తున్న అంటూ పేర్కొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఎస్పీ బాలసుబ్రమణ్యం స్మరించుకున్నారు. రాగం, తానం, పల్లవి శ్వాసగా జీవించారు బాలు. గానగంధర్వుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా పాట రూపంలో ఎప్పటికీ మన హృదయాల్లో సజీవంగానే ఉంటారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మొదటి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను అంటూ నారా లోకేష్ ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.