జగన్ నెల రోజుల పాలన.. మాట మీద నిలబడేందుకు యువనేత తపన.. రానున్న రోజుల్లో సవాళ్లెన్నో..!
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన నెల రోజులు పూర్తయింది. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుండే జగన్ తన హామీల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు. పింఛన్లను పెంచుతూ తొలి సంతకం చేసారు. కేబినెట్లో సామాజిక సమీకరణాల ద్వారా అందరి ప్రశంసలు అందుకున్నారు. అవీనితిని సహించేది లేదంటా హెచ్చిరంచారు.
పోలవరం పైనా దిశా నిర్ధేశం చేసారు. కేంద్రంతో..తెలంగాణతో సత్సంబంధాలను కొనసాగిస్తూ సమస్యల పరిష్కారాని కి కొత్త విధానం అమలు చేస్తున్నారు. ఇక రాజకీయంగా మాత్రం దూకుడు ప్రదర్శిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి పైన విచారణకు మంత్రివర్గ ఉప సంఘం..ప్రజా వేదిక కూల్చివేత..కరకట్ట మీద నిర్మాణాలకు నోటీసులు ద్వారా రాజకీయంగా ఇప్పుడు జగన్ హాట్ టాపిక్గా మారారు.
మేనిఫెస్టోనే దిక్సూచిగా
ఎన్నికల ముందు నుండీ ఈ రోజు వరకూ జగన్ తనతో పాటుగా మంత్రులు..అధికారులు ఖచ్చితంగా మేనిఫెస్టోనే దిక్సూచీగా నిర్ధేశించారు. పార్టీ శాసనసభాపక్ష సమావేశం, తొలి మంత్రివర్గ సమావేశం, జిల్లా కలెక్టర్ల సమావేశంలోనూ అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల పథకాల్లోని అంశాలను ఫొటో ఫ్రేములు కట్టించి మరీ తన కార్యాలయంలో గోడలకు అలంకరించారు. మంత్రులూ అదే విధంగా చేయాలని ఆదేశించారు. ప్రతి కలెక్టర్, ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్ద మేనిఫెస్టో కాపీలు ఉండాలని స్పష్టం చేశారు. ఇక కేబినెట్ కూర్పులో సామాజిక సమీకరణాల్లో జగన్ తన మార్క్ చూపించారు. 60 శాతం మంత్రి పదవులను బీసీ-ఎస్సీ-ఎస్టీ-మైనార్టీలకే అప్పగించారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించారు. ఆ వర్గాలకు కీలకమైన మంత్రి పదవులు ఇచ్చారు. దళిత మహిళను హోంమంత్రిగా నియమించారు. బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను అసెంబ్లీ స్పీకర్ను చేశారు. తమ ప్రభుత్వంలో అన్ని పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం ఇస్తామన్నారు.
పార్టీ ఫిరాయింపులపైన స్పష్టత..
రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. చంద్రబాబు చేసినట్లు తాను రాజ్యాంగాన్ని అపహాస్యం చేయనని అసెంబ్లీలోనే ప్రకటించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండాలన్నదే తన విధానమన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించనని తేల్చిచెప్పారు. పార్టీ మారిన వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి కూడా మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వాలని జగన్ విన్నవించారు. అవినీతి రహిత పాలన అందించేందుకు జగన్ కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే విచారిస్తానని... రుజువైతే పదవుల నుంచి తక్షణమే తొలగిస్తానని తొలి మంత్రివర్గ సమావేశంలోనే స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదన్నారు.
జగన్ పాలనలో కీలక నిర్ణయాలు..
నెల రోజుల పాలనలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పింఛన్ల పెంపుపై తొలి సంతకం చేశారు . పింఛన్లను దశల వారీగా రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామన్న ఎన్నికల హామీని అమలు చేస్తూ తొలి దశలో పింఛన్ను రూ.2,250కు పెంచుతూ నిర్నయించారు. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా కొత్తగా 5.50 లక్షల మందికి పింఛన్లు అందే అవకాశం ఉంది. డయాలసిస్ చేయించుకుంటున్న మూత్రపిండా ల వ్యాధిగ్రస్తులకు పింఛన్ నెలకు రూ.3,500 నుంచి రూ.10 వేలకు పెంచారు. ఆశావర్కర్ల జీతాలు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు ద్వారా రాష్ట్రంలో 42 వేల మందికి లబ్ధి చేకూరుతుంది. అదే విధంగా.. అంగన్వాడీ కార్యకర్తల జీతాలు రూ.11,500కు పెంపుతో రాష్ట్రంలో 55 వేల మందికి ప్రయోజనం కలగనుంది. పారిశుధ్య కార్మికుల జీతాలు ఏకంగా రూ.18 వేలకు పెంపుదలకు ఆమోద ముద్ర వేసారు. హోంగార్డులు, డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్పర్సన్ల జీతాలు సైతం పెంపు పైనా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 13,060 గ్రామాల్లో 5.60 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు. జనవరి 26 నుంచి అమ్మఒడి అమలు కానుంది. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ అమలు ప్రకటించారు. ఆర్టీసి విలీనం కోసం కమిటీ నియమించారు.
రాజకీయంగా జగన్ దూకుడు
ఇక రాజకీయంగా జగన్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒక వైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం..తెలంగాణ ప్రభుత్వం తో సత్సంబంధాలు కొనసాగిస్తూ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. నదీ జలాల వినియోగంలో అంగీకారానికి వస్తున్నారు. పోలవరం డీపీఆర్కు ప్రధాని ఆమోద ముద్ర వేసారు. పోలవరం పైన వేసిన కేసులను విత్ డ్రా చేసుకోవటానికి కేసీఆర్ అంగీకారం తెలిపారు. ఇక, గత ప్రభుత్వ అవినీతిని వెలికి తీయటానికి జగన్ మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేసారు. కరకట్ట మీద అక్రమ నివాసాలను కూల్చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా చంద్రబాబు నిర్మించిన ప్రజా వేదికను కూల్చేసారు. ఇప్పుడు చంద్రబాబుకు ఉంటున్న నివాసాని కి నోటీసులు ఇచ్చారు. ఇదే సమయంలో బీజేపీ టీడీపీ ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీనిని గ్రహించి ప్రజల్లో తన పట్ల పాజిటివ్ ధోరణి పెంచుకొనేలా.. ఆమోదం లభించేలా జగన్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ రాజకీయ పరిణామాలను అంచనా వేస్తూ రాజకీయ అడుగులు వేస్తున్నారు.