బోటు ప్రమాద స్థలికి సీఎం జగన్: రంగంలోకి తెలంగాణ మంత్రులు: కేంద్రం ఆరా..!!
గోదావరిలో బోటు ప్రమాద బాధితులను పరామర్శిచేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రమాద స్థలికి వెళ్లనున్నారు. అమరావతిలో ఆయన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గాన దేవీపట్నం వెళతారు. నదిలో గాలింపు చర్యలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం జిల్లా అధికారులతో పాటుగా విపత్తు నిర్వహణా సిబ్బందితో సమావేశం అవుతారు. స్థానిక అస్పత్రుల్లో చికిత్సి పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు సహాయక చర్యలను స్థానికంగా ఉండి పర్యవేక్షిస్తున్నారు.
వెంటనే బోటు అనుమతులు సస్పెండ్ చేయాలని సీఎం ఆదేశించారు. అదే విధంగా విపత్తు నిర్వహణల శాఖ ఎప్పటి కప్పుడు ఘటనా స్థలిలో జరుగుతన్న చర్యల గురించి ముఖ్యమంత్రికి నివేదిస్తున్నారు. దీని పైన ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. ముందుగా సహాయక చర్యలు..మునిగిన బోటును వెలికి తీసిన తరువాత ప్రభుత్వం దీని మీద ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే..ముఖ్యమంత్రి జగన్ ఈ ఘటన మీద సీరియస్ గా ఉన్నారు.
ఆదివారం కలసి రాని బోటు ప్రయాణం..30 ఏళ్లలో 100 మందికి పైగా మృత్యువాత..!!
ఇక..ఘటన జరిగిన వెంటనే ఏపీ ప్రభుత్వంతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అప్రమత్తమయ్యారు. ఘటనలో తెలంగాణ ప్రాంతం నుండి వరంగల్ .. హైదరాబాద్ కు చెందిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలియటంతో ఏపీ అదికారులకె సాయంగా సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రులు మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, ఎర్రబెల్లి, సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఏపీ మంత్రి కన్నబాబుతో మాట్లాడారు. అవసరమైన సహాయక చర్యలు అందిస్తామన్నారు. చికిత్స పొందుతున్న బాధితులతో మంత్రి కన్నబాబు తెలంగాణ మంత్రి కేటీఆర్ తో ఫోన్ లో మాట్లాడించారు. ఏపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పది లక్షలు ప్రకటించగా..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హుటాహుటిన రాజమండ్రి వెళ్లారు. సోమవారం మంత్రి ఎర్రబెల్లి రాజమండ్రికి వెళ్లనున్నారు. ఏపీ మంత్రి కురసాల కన్నబాబుతో ఇప్పటికే ఫోన్లో మాట్లాడారు. మృతదేహాలను ఎక్కడికి తీసుకురావాలనేదానిపై ఆయా జిల్లా అధికారులతో చర్చిస్తున్నారు. ఇక, ఈ ప్రమాద: పైన కేంద్ర ప్రభుత్వం సైతం ఆరా తీసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడారు. ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయని కిషన్ రెడ్డి చెప్పారు. ఏపీ ప్రభుత్వ వినతి మేరకు ఉత్తరాఖండ్ నుండి ప్రత్యేక సహాయ టీం లు రాజమండ్రికి చేరుకుంటున్నాయి. ముఖ్యమంత్రి అక్కడ సహాయక చర్యలకు ఇబ్బంది లేకుండా హెలికాఫ్టర్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి జగన్ పరిశీలిస్తారు.