రాజకీయం, రాజనీతి మధ్య జగన్ నలుగుతున్నారా..? కన్ఫ్యూజన్లో కాలం వెళ్లదీస్తున్న ఏపి సీఎం..!!
అమరావతి/హైదరాబాద్ :ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తొందరపడుతున్నారు. దేనికోసమో ఆయన ఆరాటపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎన్నికల వేళ ఎంతో గొప్పగా వ్యవహరించిన జగన్కు ఏమైంది. నెలరోజుల పాలనతోనే తనను తాను నిరూపించుకోవాలని ఎందుకు ఆరాటపడుతున్నారు. ఐదేళ్ల వ్యవదిని చక్కగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇటు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, అటు ప్రధాని మోదీతో మంచి సంబందాలున్నాయి. జగన్ను దిక్కరించి వ్యతిరేక కూటమి పెట్టేందుకు వైసీపీ నేతలు సాహసించరు. టీడీపీ, జనసేన ఉన్నా కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యాయి. ఇన్ని సానుకూలతలు ఉన్నా జగన్ ఏదో అభద్రతా భావంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది స్వయంగా అనుభవిస్తున్న ఆందోళనా లేక వెనక ఎవరైనా ప్రభావితం చేస్తున్నారా..? యువ సీఎం అడుగులు ఆదిలోనే ఎందుకు తడబడుతున్నాయి.? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అవినీతిపై జగన్ తొలి దెబ్బ..! అనుకున్నంత తేలిగ్గా జరగే పనేనా..?
అధికారం చేపట్టగానే అవినీతి అంతం అంటూ పెద్దపెద్ద మాటలు చెప్పారు ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన మనోవేదన ప్రకారం రాజకీయాల్లో నిజంగానే అవినీతి పెరిగింది. కానీ దాన్ని అంత తేలికగా మట్టు బెట్టడం, అంతం చేయడం అంత సాద్యం కాకపోవచ్చు. అన్నా హజారే వల్లనే అవినీతిని అంత చేయడం సాద్యపడలేదు. అటువంటిది జగన్ వల్ల అవుతుందా అనే సందేహం కూడా సగటు ఏపీ ప్రజల్లో ఉంది. రూపాయి పోయినా.. తమకు అనుకూలమైన పనులు సకాలంలో పూర్తికావాలనేది సగటు ఓటరు భావించడం అత్యంత సహజం.
Recommended Video
ఏదో తెలియని తికమక..! జగన్ లో కనిపిస్తున్న అభద్రతా భావం..!!
ఇప్పుడు వ్యవసాయ సీజన్ విత్తనాలు, సాగునీరు, పంటపెట్టుబడులు చాలా కీలకం. అయితే దీనికి ఏప్రిల్ లోనే ప్రణాళిక రూపొందించాలి. కానీ.. అప్పుడు టీడీపీ అదికారంలో ఉంది. పైగా ఎన్నికల కోడ్ ఉంది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. తప్పొప్పులు ఏవైనా దాని ప్రతిఫలం జగన్ మాత్రమే అనుభవించాల్సి ఉంటుంది. మరోవైపు ఇసుక విషయంలో కోస్తా నేతల మధ్య వైరం మొదలైంది. వైసీపీ ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, జోగి రమేష్ మధ్య వైరం మొదలైనట్టు ఇప్పటికే చర్చ జరుగుతోంది.
కూల్చివేతల నిర్ణయం వెనక ఎవరైనా ఉన్నారా..! ఆఘమేఘాల మీద ఆ పని ఎందుకంటున్న పార్టీ శ్రేణులు..!!
రాజధానిలో ప్రజావేదిక కూల్చివేత సరైన నిర్ణయమే అయినా.. అదే స్పీడు.. కృష్ణ, గోదావరి నదుల ఒడ్డున ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటిపైనా తీసుకుంటారా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. వాటిలో బడులు, గుడులు, వ్యాపారవేత్తల విలాస భవనాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూలగొట్టగల సమయం, మందీమార్భలం, న్యాయ పరమైన అడ్డంకులను అధిగమించగలరా ! అనేది కూడా మరో సందేహం. పింఛన్లు, అమ్మ ఒడి, పోలవరం రీ టెండర్లు, మౌలిక సదుపాయాలు, ఇవన్నీ ఎలా ఉన్నా.. తాను చెప్పిన నవరత్నాలు అమలుకు ఎంతవరకూ బడ్జెట్ కేటాయించగలరనే దానిపై కూడా వైసీపీ నేతల్లో స్పష్టత కొరవడింది.
జగన్ ను ప్రభావితం చేస్తున్న శక్తులు వేరే ఉన్నాయా..! ఎందుకా అయోమయం అంటున్న నేతలు..!!
కొత్తగా పాలనా పగ్గాలు చేపట్టిన జగన్కు రాజకీయం, రాజనీతి రెండింటి మధ్య నలుగుతున్నాడు. పూర్తిగా పార్టీలో తన అనుకున్న కొందరు సీనియర్లు, రెడ్డివర్గంలో నమ్మకస్తులు, తండ్రికి అండగా నిలిచిన అధికారులపై భారమేశారు జగన్ మోహన్రెడ్డి. తండ్రిని గుర్తుచేసేలా ప్రజల మనసులో చోటు తెచ్చుకోవాలని ఆశపడుతున్నారు. అంతే కాకుండా తండ్రి దారిలోనే తాను అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించారు. ఫలితాన్ని విజయం రూపంలో దక్కించుకున్నారు. మరి అదే పరిణతితో ఎందుకు పాలన సాగించలేకపోతున్నారు. నెలరోజులు దాటినా ఇప్పటికీ కన్ఫ్యూజన్లో ఉన్నారనే ప్రశ్నలకు వైసీపీ నేతల వద్ద కూడా సమాధానం కరవైందనే ప్రచారం జరుగుతోంది.