సీఎం జగన్ డిసైడ్ చేసేసారు : వైసీపీ ముగ్గురు ఎమ్మెల్సీలు ఖరారు : ఎంపికలో అదే కీలకంగా ...!
ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ నుండి ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను అధికారికంగా ఖరారు చేసారు. ముందు నుండి అంచనా వేస్తున్నట్లుగా తొలి రెండు పేర్లు అవే కాగా..మూడో పేరు విషయంలో మాత్రం అనేక తర్జన భర్జన తరువాత నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న మోపిదేవి వెంకరమణ పేరును ప్రకటించారు. అదే విధంగా రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో ప్రకటించిన విధంగా మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ కు అవకాశం ఇచ్చారు. అదే విధంగా.. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత చల్లా రామక్రిష్టా రెడ్డి పేర్లను ముఖ్యమంత్రి ఖరారు చేసారు. అయితే ఇక్బాల్.. చల్లా రామక్రిష్టా రెడ్డి ఇద్దరూ కర్నూలు జిల్లాకు చెందిన వారే. ఈ ముగ్గురిలో ఇద్దరు తాజా ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసి ఓడిన వారే. ఈ నెల 14న నామినేషన్లకు తుది గడువు కావటంతో తాజాగా జగన్ నిర్ణయం ప్రకటించారు.
బీసీ..మైనార్టీ..రెడ్డి వర్గాలకు అవకాశం..
ఎన్నికల సంఘం తాజాగా ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నోటీఫికేషన్ జారీ చేసింది. తాజా ఎన్నికల సమయానికి ఎమ్మెల్సీలుగా ఉంటూనే ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలవటంతో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. టీడీపీ నుండి కరణం బలరాం..వైసీపీ నుండి ఆళ్ల నాని.. కొలగట్ల వీరభద్ర స్వామి ఎమ్మెల్యేలుగా గెలవటంతో ఆ ముగ్గురు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసారు. ఈ ముగ్గురు స్థానంలో కొత్తగా ఎన్నికయ్యే సభ్యులకు వారికి మిగిలి ఉన్న కాలపరిమితి వరకు ఎమ్మెల్సీలుగా కొనసాగుతారు. ప్రస్తుతం ఏపీ శాసనసభలో పార్టీలకు ఉన్న సంఖ్యబలం ఆధారంగా మూడు స్థానాలు అధికార వైసీపీకే దక్కనున్నాయి. ఇందుకోసం ముఖ్యమంత్రి జగన్ ముగ్గురు అభ్యర్ధులను ఖరారు చేసారు. అందులో ప్రస్తుత మంత్రి..బీసీ వర్గానికి చెందిన మోపిదేవి వెంకరమణ.. మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ ఇక్బాల్.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చల్లా రామక్రిష్టా రెడ్డి ఉన్నారు. అందులో ఇద్దరు రామక్రిష్టా రెడ్డి..ఇక్బాల్ రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు కాగా..మోపిదేవి గుంటూరు జిల్లా వాసి. ఈ నెల 14వ తేదీ నామినేషన్లకు చివరి తేదీ. ఈ ముగ్గురి ఎంపిక లాంఛనమే.
ఎన్నికల్లో ఓడిన ఇద్దరికీ ఛాన్స్..
తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిన ఇద్దరికీ జగన్ తిరిగి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు. వీరి ఎంపిక వెనుక జగన్ కీలక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మోపిదేవి వెంకట రమణ గుంటూరు జిల్లా రేపల్లె నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా..ముఖ్యమంత్రి ఆయనకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. జగన్ పైన కేసులు నమోదై..జైలు శిక్ష అనుభవించిన సమయం లో వ్యాన్ పిక్ కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొన్న మోపిదేవి సైతం జగన్ తో పాటుగా జైలు జీవితం గడిపారు. తాను కష్ట కాలంలో ఉన్న సమయంలో అండగా నిలవటంతో పాటుగా జైలు జీవితం గడపాల్సి వచ్చిన మోపిదేవికి జగన్ మంత్రిగా అవకాశం ఇచ్చారు. మంత్రి అయిన వారు ఆరు నెలల లోగా చట్ట సభలకు ఎంపిక కావాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్బాల్ సైతం ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఆయనకు చివరి నిమిషంలో అనంతపురం జిల్లా హిందూపూర్ సీటు ఖరారు చేసారు. సినీ హీరో బాలక్రిష్ట మీద పోటీ చేసి ఇక్బాల్ ఓడిపోయారు. అయితే, జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత గుంటూరులో జరిగిన రంజాన్ ఇఫ్తార్ విందులో తాను ముస్లింలకు అయిదు స్థానాలు ఇవ్వగా..నలుగురు గెలిచారని..ఓడిన ఆ ఒక్కరికీ తిరిగి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగానే ఇప్పుడు ఈ ఇద్దరూ ఎన్నికల్లో ఓడినా ముఖ్యమంత్రి పెద్దల సభకు అవకాశం కల్పించారు.
చల్లాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ..
ఇక, కర్నూలు జిల్లా రాజకీయాల్లో సీనియర్ అయిన చల్లా రామక్రిష్టారెడ్డికి ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్సీ ఖరారు చేసారు. ఎన్నికల ముందు టీడీపీ నుండి ఆయన వైసీపీలో చేరారు. ఆ సమయంలోనే ఆయన ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించగా..జగన్ ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో..ఇప్పుడు తొలి విడతలోనే ఆయన పేరు ఖరారు చేసారు. ఇదే సమయంలో టీడీపీలో ఎంపీగా పని చేసి పార్టీలో చేరిన పండుల రవీంద్ర బాబు పేరు సైతం చివరి దాకా పోటీలో ఉంది. ఇక, నాటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి..వైసీపీ అభ్యర్ధి గెలుపుకు సహకరిస్తే మర్రి రాజశేఖర్ కు సైతం ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ నాడు హామీ ఇచ్చారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలను పరిగణలోకి తీసుకొని చల్లా పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. తాజా ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. స్థానిక ఎన్నికల్లోనూ ఇదే హవా కంటిన్యూ చేయాలని జగన్ భావిస్తున్నారు. ఇక, అనంతపురం జిల్లాలో ఓడిన రెండు స్థానాల్లో హిందూపూర్ టీడీపీకి కంచుకోట. భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా అక్కడ నుండి పోటీ చేసి ఓడిన మైనార్టీ అభ్యర్ధికి జగన్ ఎమ్మెల్సీగా ఖరారు చేసారు.