జగన్ సంచలన నిర్ణయం: వైద్య - ఆరోగ్య శాఖ సీఎం వద్దే: ఆశా వర్కర్ల వేతనం పదివేలకు పెంపు..!
ఏపీ నూతన మఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన వైద్య శాఖను తానే పర్యవేక్షిస్తానని ప్రకటించారు. అదే విధంగా ఏపీలోని ఆశా వర్కర్ల వేతనాన్ని ఇప్పటి వరకు మూడు వేలు ఉండగా..పది వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఏపీలో 108 వాహనాలు ప్రతీ చోట అందుబాలులో ఉండాలని.. శాఖలో అవినీతిని సహించది లేదని స్పష్టం చేసారు. ఇప్పటి వరకు అమలు చేస్తున్న విధానాల పట్ల సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేసారు. సమూల మార్పుల దిశగా సూచనలు అందించారు.
వైద్య-ఆరోగ్య శాఖ జగన్ వద్దే..
ఈనెల 8న కేబినెట్ విస్తరణ చేపట్టాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ తానే పర్యవేక్షిస్థానని ప్రకటించారు. వైద్య ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా తానే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేసారు. వైద్య ఆరోగ్య శాఖలో నెలకొన్ని అస్తవ్యస్థ విధానాల పైన అసంతృప్తి వ్యక్తం చేసారు. అదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఎంతో కాలంగా తమ వేతనాలు పెంచాలని ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లకు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు మూడు వేలుగా ఉన్న వారి జీతం ఒకేసారి పది వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రతీ చోట 108 వాహనాలు కనిపించాలి..
ఏపీలో 108 వాహనాల నిర్వహణ పైన ముఖ్యమంత్రి ఆరా తీసారు. వీటి నిర్వహణ గందరగోళంగా ఉండటంతో...వీటికి పూర్వ వైభవం తేవాలని..ప్రతీ చోట 108 కనిపించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖలో సమూల ప్రక్షాళన కోసం తీసుకోవాల్సిన చర్యల పైన 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వైయస్సార్ మానసిక పుత్రిక ఆరోగ్య శ్రీ అని ఆ పధకాన్ని పటిష్ఠంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసారు. ప్రయివేట్ ఆస్పత్రులు కన్నా ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే 104 వాహనాలౖ నిర్వహణపై కూడా ముఖ్యమం త్రి చర్చ జరిపారు. వీటి పునరుద్దరణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని సూచించాలని నిర్ధేశించారు.
ఇక నుండి వైయస్సార్ ఆరోగ్యశ్రీ
ఏపీలో ప్రస్తుతం అమలవుతున్న ఎన్టీఆర్ వైద్యసేవ పేరును వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వైఎస్సార్ స్పూర్తికి అనుగుణంగా ఈ సర్వీసులు పనిచేయాలన్నారు. తాము ఎన్నికల మేనిఫెస్టోలో ..పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వెయ్యి రూపాయలు దాటిన ప్రతీ చికిత్స ఈ ఆరోగ్య శ్రీ కిందకు వచ్చేలా విధి విధానాలు రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు, మౌలిక వసతులు, సిబ్బంది కొరత, ఆరోగ్యశ్రీ పథకంలో తీసుకురావాల్సిన మార్పులపై కూడా దృష్టి సారించారు.