సీఏం జగన్ మరో కీలక నిర్ణయం.. పబ్లిక్ పల్స్ తెలుసుకుందాం ఆ తర్వాతే బడ్జెట్ పైన..!
వరసగా రెండో ఏడాది ఏపీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తప్పేలాలేదు. 2019 ఎన్నికల కారణంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ అకౌంట్ ప్రవేశపెట్టింది. అధికారంలోకి వచ్చాక జగన్ ప్రభుత్వం తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఈ నెలలో 2020-21 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం భావించినా తాజాగా హైకోర్టు తీర్పుతో ఆలోచన మారింది.
రిజర్వేషన్లు కుదిస్తూ ఆర్డినెన్స్
స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలాఖరులోగా పూర్తి చేయకపోతే... కేంద్రం నుంచి రావలసిన స్థానిక సంస్థల నిధులు రూ. 3వేల కోట్లకు పైగా నిలిచిపోనున్నాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 59.85శాతం రిజర్వేషన్లతో జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఆర్థికంగా సతమతమవుతున్న రాష్ట్రం కేంద్రం నిధులు వదులుకోవడానికి సిద్ధంగా లేదు. దీంతో ముఖ్యమంత్రి జగన్ సీనియర్ మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి, ఇతరులతో సుదీర్ఘంగా చర్చించారు. 4వ తేదీ జరిగే కేబినెట్లో రిజర్వేషన్లను 50శాతానికి కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకురానున్నారు. ఆ వెంటనే స్థానికి సంస్థల షెడ్యూల్ విడుదల కానుంది.
ముందుగా ఓటాన్ అకౌంట్కు ఆమోదం తెలపనున్న కేబినెట్
ఇప్పటికే గత కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు మొత్తం 15 రోజుల్లోగానే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. దీంతో ఈ సారి బడ్జెట్ సమావేశాలను సైతం కుదించనున్నారు. మంత్రులకు ఎన్నికలు బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం నాటి కేబినెట్లో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ నెలాఖర్లో ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి ముందుగా మూడు నెలలకు అవసరమయ్యే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించనున్నారు. తిరిగి జూన్లో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తిస్థాయి బడ్జెట్కు వెళ్లాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది.
Recommended Video
ఏప్రిల్ 1 నుంచి ఒక్కరూపాయి కూడా ఖర్చు చేసే అధికారం ఉండదు
ఈ నెల 31 లోగా కనీసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను అయినా ఆమోదించకపోతే ఏప్రిల్ 1 నుండి ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి కూడా ఖర్చు చేసే అధికారం ప్రభుత్వానికి ఉండదు. అయితే ఈ నెలలోనే ఇంటర్ పరీక్షలతో పాటుగా చివరి వారంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల విధులకు ఉపాధ్యాయులే కీలకం కావడంతో ఎన్నికల నిర్వహణ నిర్ణయం తీసుకున్నా... ఈ సమస్య ప్రభుత్వానికి అవరోధంగా మారే అవకాశం ఉంది. స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఎన్నికల నిర్వహణ పైన నిర్ణయం జరిగితే పరీక్షల కారణంతో ఎన్నికలు వాయిదా వేయాలంటూ న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు.ఈ దిశగానే ప్రభుత్వంలో చర్చ జరిగినా పూర్తి సమాచారం ప్రత్యామ్నాయా మార్గాలతో కేబినెట్ సమావేశానికి సిద్ధం కావాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. వీటన్నిటిపైనా చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్పైన 4న జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.