రణమా..వరమా: ప్రధానితో ఏపీ సీఎం జగన్ ఓపెన్ హార్ట్: రాజకీయంగానూ కీలక నిర్ణయాల దిశగా..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీ సమస్యల మీద తొలి సారిగా ప్రధానితో అధికారిక భేటీ. అయితే, ఢిల్లీలో నెలకొన్ని పొలిటికల్ హీట్లో అప్పాయింట్మెంట్ రద్దు కాకుండా ఉంటుందా..ప్రధానితో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం భేటీ కొనసాగుతుందా అనే అనుమానమూ ఉంది. అయితే రెండు నెలల క్రితం వరకు జగన్ - మోదీ మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. అయితే, జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ..కొంత గ్యాప్ కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఆ గ్యాప్ భర్తీ కోసమే ముఖ్యమంత్రి ప్రధానంగా తన నిర్ణయాల వెనుక ఉన్న కారణాలను ప్రధానికి వివరించాలని నిర్ణయించారు. మరి..ప్రధాని ఈ వివరణలతో సంతృప్తి చెందుతారా .. జగన్కు మోదీ సహకారం కొనసాగుతుందా అనేదే ఇప్పుడు ఆసక్తి కరమైన చర్చ..
ప్రధానితో భేటీ కానున్న సీఎం జగన్..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధానితో అప్పాయింట్మెంట్ ఖరారైంది. ఇందులో మార్పు ఉంటుందా లేక మీటింగ్ సాగుతుందా అనేది చివరి వరకు సందేహమే. ఏపీలో జగన్ విజయాన్ని ప్రధాని మోదీ ఆస్వాదించారు. జగన్ గెలుపు కంటే చంద్రబాబు ఘోర పరాజయాన్ని మోదీ ఎంతగా సంతోషించారో..ఎన్నికల్లో గెలిచాక తొలి సారి ఢిల్లీలో జగన్ ప్రధానిని కలిసిన సమయంలో ఆయన హాహ భావాలు స్పష్టం చేసాయి. ఏపీ అభవృద్ది కోసం జగన్తో కలిసి ముందకు సాగుతామని ప్రధాని స్పష్టం చేసారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ ఈ రెండు నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాల పైన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బీజేపీ నేతలు జగన్ లక్ష్యంగా ఆరోపణలు ఎక్కు పెట్టారు. ఆయన నిర్ణయాలను టీడీపీ కంటే ఎక్కువగా విమర్శిస్తున్నారు. రెండు నెలల సమయం లోనే ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలను పిలుపునిస్తున్నారు. ఈ సమయంలో అమరావతితో కాదు..ఇక ఢిల్లీలోనే దీని పైన స్పష్టత తీసుకోవాలని జగన్ నిర్ణయించారు.
పీపీఏలు..పోలవరం పైనా వివరణ..
జగన్ ప్రభుత్వం పీపీఏల రద్దు..పోలవరం పనుల నుండి నవయుగను తప్పించటం పైన కేంద్ర మంత్రులు అసంతృ ప్తి వ్యక్తం చేసారు. పీపీఏల వ్యవహారం ఇప్పుడు హైకోర్టులో ఉంది. దీని పైన కేంద్ర ప్రభుత్వ మూడ్ తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం ఒక అడుగు వెనక్కు వేసింది. అదే సమయంలో రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా నవయుగ సంస్థను తప్పించింది. దీంతో.. కేంద్ర జలశక్తి మంత్రి పార్ల మెంట్ వేదికగా నిర్ణయాన్ని తప్పు బట్టారు. దీంతో..ఇప్పుడు ప్రధాని మోదీకి ఈ రెండు నిర్ణయాల వెనుక కారణాలను ప్రధానికి వివరించనున్నారు. గత ప్రభుత్వం చేసిన అవినీతికి సంబందించిన ఆధారాలను ప్రధాని ముందు ఉంచాల ని జగన్ భావిస్తున్నట్లు సమచారం. దీని పైనే అధికారులతో ఆయన జెరూసెలం పర్యటన నుండి రాగానే సుదీర్ఘంగా సమావేశమయ్యారు. కేంద్రంతో వైరం తమ ఉద్దేశం కాదని..అవినీతిని బయట పెట్టటంతో పాటుగా పారదర్శకంగా ఉండాలనేదే తమ లక్ష్యమని వివరిస్తూనే..ఏపీకి అండగా నిలవాలని ప్రధానిని సీఎం జగన్ కోరనున్నారు.
రాజకీయంగానూ ఓపెన్ అవుతారా..
ఇక, ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వీటి మీద ఢిల్లీ పర్యటనలో ప్రధానితో పాటుగా బీజేపీ జాతీయా ధ్యక్షుడు అమిత్ షాతోనూ సీఎం జగన్ సమావేశం అవుతున్నారు. ఈ ఇద్దరితో సమావేశమైన సమయంలో తాము కొంత కాలంగా బీజేపీ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయానికి మద్దతుగా నిలుస్తున్నా.. ఏపీకి వచ్చిన బీజేపీ నేతలు..స్థానిక నాయక త్వం తన ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణల గురించి వారిద్దరికి జగన్ వివరించనున్నారు. ఏపీలో పవన్తో కలిసి రాజకీయంగా ముందుకు సాగాలని బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. దీంతో..బీజేపీ నేతల విమర్శల గురించి సీఎం జగన్ నేరుగా అమిత్ షాతో చర్చించాలని భావిస్తున్నారు. ఓపెన్ మనసుతో మాట్లాడి అటు కేంద్ర నుండి ఏపీకి సహకారం అదే విధంగా రాజకీయంగా సంబంధాల మీద ఈ పర్యటనలో క్లారిటీ వస్తుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే,అమిత్ షా అసలు ఇప్పుడు పూర్తిగా కాశ్మీర్ అంశం పైనే దృష్టి సారించటం..అందునా లోక్సభలో ఈ రోజు చర్చ ఉండటంతో..జగన్ అప్పాయింట్మెంట్లు యధావిధిగా కొనసాగుతాయా లేదా అనేది ఇంకా సందేహమే.