వైయస్ తనయుడిగా .. నా డ్రీమ్ అదే: నవశకం తీసుకొద్దాం..కలిసిరండి : డల్లాస్ సభలో సీఎం జగన్..!!
వైయస్ జగన్ అనే నేను..అంటూ డల్లాస్ సమావేశానికి వచ్చిన తెలుగు కమ్యూనిటీతో ముఖ్యమంత్రి మమేకం అయ్యారు. నాడు తన తండ్రి మీద..నేడు తన మీద చూపిస్తున్న అభిమానానికి సెల్యూట్ చేసారు. జగన్ సభ కోసం అమెరికా నలు మూలల నుండి తరలి వచ్చారు. తెలుగు వారి ఘనతను కీర్తిస్తూనే..జగన్ తన లక్ష్యాలేంటో చాటి చెప్పారు. ఏపీలో తన విజయానికి ప్రవాసాంధ్రులు అండగా నిలిచారని జగన్ చెప్పుకొచ్చారు. పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టడానికి మీరు రండి.. మీకు అండగా మేముంటామని మీకు హామీ ఇస్తున్నాంటూ ఆహ్వానించారు. వైయస్ తనయుడిగా.. ఏపీలో నవ శకం తేవటమే తన డ్రీం అంటూ..కలిసి రావాలని ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం..ప్రవాసాంధ్రులు కలిసి గ్రామాలను బాగుచేసుకుందాం అంటూ సూచించారు. డల్లాస్ మొత్తం జగన్ ఫొటోలతో నిండిపోయింది. వైసీపీ ఎంపీలు..నేతలు సైతం జగన్ తో పాటుగా డల్లాస్ సభలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు తరలి వచ్చారు.
జగన్ అనే నేను..మీకు సెల్యూట్..
జగన్ అనే నేను..వైయస్ తనయుడిగా..రికార్డు స్థాయిలో 50 శాతానికి పైగా ఓట్లు గెలిచిన పార్టీ అధినేతగా.. 3648 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన నేతగా.. పల్లెల్లో పట్టణాల్లో ప్రజలతో మమేకం అయిన వ్యక్తిగా.. స్పష్టమైన విజన్ తో ముందకు వెళ్తున్నానని చెప్పుకొచ్చారు. 151 అసెంబ్లీ సీట్లు...22 లోక్ సభ సీట్లు గెలిచామంటే అందులో ప్రవాసాంధ్రుల సహకారం మరవలేనదని చెప్పుకొచ్చారు. మార్టిన్ లూథర్ కింగ్ గురించి..ఆయన చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ జగన్ తన ప్రసంగం కొనసాగించారు. ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అన్న మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ స్ఫూర్తిదాయకం అంటూ అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రాన్ని చూడాలనేది తన కలగా చెప్పారు. అన్నం పెడుతున్న రైతు ఆకలిబాధతో మరణించకూడదన్నది తన కల అని స్పష్టం చేసారు. ఏ ప్రభుత్వ పథకమైనా లంచం, వివక్ష లేకుండా పేదవాడికి అందుబాటులోకి రావాలన్నది తన కల అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి కాల్వల ద్వారా నీరు అందించాలన్నది నా కల... పాలకులు మనసు పెడితే చేయలేనిది ఏదీ లేదు...అని చెబుతూనే తన రెండున్నర నెలల పరిపాలనలోనే చరిత్రను మార్చే దిశగా అడుగులు వేస్తున్న విధానాలను ముఖ్యమంత్రి జగన్ వివరించారు.
మా నిర్ణయాల వెనుక లక్ష్యం ఇదే..
తన పాలనలో తీసుకొచ్చిన చట్టాలను..నిర్ణయాలను జగన్ వివరించారు. అమ్మ ఒడి..రైతు భరోసా..ఆరోగ్యశ్రీ, పేదలకు ఇళ్ల పట్టాలు వంటి కార్యక్రమాలు చేపట్టామని చెప్పుకొచ్చారు. గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్..మద్యం బెల్టు దుకాణాల మూసివేత చేపట్టామని చెబుతూ... మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చట్టం చేశామని జగన్ వివరించారు. వినీతికి ఆస్కారం లేకుండా టెండర్ల విషయంలో న్యాయ సమీక్ష చేపట్టాలని నిర్ణయించామని.. దేశంలో కనీవినీ ఎరుగని విధంగా రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొస్తున్నామని ప్రకటించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తున్నామన్నారు. పాఠశాలలు. గత ప్రభుత్వం అవకాశం ఉన్నా తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయలేదని జగన్ ఆరోపించారు. 13 నెలలుగా డిస్కమ్లకు బిల్లులు కూడా చెల్లించలేదని... దాదాపు రూ.20వేల కోట్లు డిస్కమ్లకు బకాయిలు పడిందని వివరించారు. రాష్ట్రంలో పోర్టులు, విమానాశ్రయాలు, రైలు మార్గాలు ఉన్నాయి. పల్లెలు, పట్టణాల మధ్య అంతరాలను చెరిపేసే చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి ప్రవాసాంధ్రులకు వివరించారు.
కలిసి రండి..నవశకం నిర్మిద్దాం..
ప్రవాసాంధ్రులు ఏపీ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానించారు. కనీసం ఏడాదికి ఒకటి.. రెండు సార్లయినా ప్రవాసాంధ్రులను ఏపీకి రావాలని ఆహ్వానిస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం.. ప్రవాసాంధ్రులు కలిసి గ్రామాలను బాగుచేసుకుందాం అంటూ పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెబ్సైట్లో ఒక పోర్టల్ తెరవబోతున్నామని... పోర్టల్ నేరుగా సీఎం కార్యాలయానికి అనుసంధానమై ఉంటుందన్నారు. మీరుపెట్టుబడులు పెట్టాలనుకుంటే పోర్టల్లో చెప్పొచ్చుని... పోర్టల్ పర్యవేక్షణకు ఒక అధికారిని నియమిస్తాం అని ప్రకటించారు. పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టడానికి మీరు రండి.. మీకు అండగా మేముంటామని మీకు హామీ ఇస్తున్నాను అంటూ భరోసా ఇచ్చారు. మీ గ్రామాల బాగును కోరుకునేవారు..మీరు చదుకున్న బడులను మార్చాలనుకునే వారు.... మీరు సహకారం అందించిన నిర్మాణాలను మీ పేర్లే పెడుతామని ప్రకటించారు. అందరిని రమ్మని కోరుతున్నాను. మీకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది. మీరు, మనం కలిసి మన గ్రామాలను బాగు పర్చుకుందామని పిలుపునిచ్చారు. మీరంతా మేము చేస్తున్న మంచి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వమని కోరుతున్నానని. చిన్న పిల్లలను నుంచి అవ్వతాతలకు వరకు పలకరించానని చెప్పండని కోరారు. అందరి చల్లని దీవేనలు ఎల్లప్పుడు తన పై ఉంచమని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నది మీ అన్న.. మీ తమ్ముడు అని మర్చిపోకండంటూ జగన్ కోరారు.