సచివాయంలోకి నేడే జగన్ ఎంట్రీ: సెక్రటేరియట్కు గవర్నర్ : ఆ వెంటనే అధికారులతో కీలక భేటీ..!
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జగన్ తొలి సారి సచివాయంలో అడుగు పెడుతున్నారు. దీని కోసం ఈ ఉదయం 8.39 గంటలను ముహూర్తంగా నిర్ణయించారు. జగన్ కార్యాలయంగా గత ముఖ్యమంత్రి చంద్రబాబు వినియోగించిన ఛాంబర్లో వాస్తు పరంగా కొన్ని మార్పులు చేసారు. ఒకటో బ్లాక్లోనే సీఎం కార్యాలయం సిద్దమైంది. ఇక, అధికారిక బాధ్యతలు చేపట్టిన తరువాత అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేయనున్నారు.గవర్నర్ సైతం సచివాలయానికి రానున్నారు.
ముఖ్యమంత్రి సచివాలయ ప్రవేశం..
ముఖ్యమంత్రి హోదాలో జగన్ సచివాలయంలోని తన అధికారిక కార్యాలయంలోకి ప్రవేశిస్తున్నారు. ఉదయం 8.39 గంలకు జగన్ సచివాలయానికి చేరుకుంటారు. 8.42 గంటలకు తన ఛాంబర్లో ప్రవేశిస్తారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తరువాత నవ రత్నాల్లో భాగంగా ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల పైన సంతకాలు చేస్తారు. అనంతరం 9.30 గంటలకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలో జగన్ తన టీంకు దిశా నిర్ధేశం చేయనున్నారు. తన లక్ష్యాలను..ప్రాధాన్యతలను వివరించటంతో పాటుగా అధికారులు..ఉద్యోగులతో తాము ఎలా వ్యవహరించబోయేదీ ప్రకటిస్తారు. అనంతరం సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలో జగన్ సమావేశం అవుతారు. ఈ సందర్భంగా పెండింగ్ డీఏలతో పాటు..పీఆర్సీ గురించి జగన్ ప్రస్తావించే అవకాశం ఉంది.
సచివాలయానికి గవర్నర్..
జగన్ అధికారిక కార్యక్రమాలు పూర్తయిన తరువాత గవర్నర్ నరసింహన్ సచివాలయానికి చేరుకుంటారు. మంత్రుల ప్రమాణ స్వీకారం కోసం ఇప్పటికే విజయవాడ చేరుకున్న గవర్నర్ 11.10 గంటలకు సచివాలయానికి వస్తారు. అక్కడ సీఎం కార్యాలయం పక్కనే ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో ప్రొటెం స్పీకర్గా నియమితులైన శంబంగి చిన అప్పలనాయుడు చేత 11.15 గంటలకు గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ కూడా హాజరవుతారు. అక్కడే పది నిమిషాలు గవర్నర్ -ముఖ్యమంత్రి భేటీ జరగనుంది.
11.49 గంటలకు ప్రమాణ స్వీకారం..
గవర్నర్ - ముఖ్యమంత్రి భేటీ తరువాత తొలి బ్లాకు పక్కనే ఏర్పాటు చేసిన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికకు ముఖ్యమంత్రి చేరుకుంటారు. ఉదయం 11.49 గంటలకు గవర్నర్ నరసింహన్ మొత్తం 25 మంది చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత మంత్రివర్గ సభ్యులందరూ గవర్నర్, ముఖ్యమంత్రితో కలసి గ్రూపు ఫొటో దిగుతారు. ఇప్పటికే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వారి పేర్లతో ఉన్న జాబితాను సీఎం జగన్..శుక్రవారమే గవర్నర్కు అందచేసారు. ఇక, ఆ కార్యక్రమం ముగిసిన తరువాత మంత్రులు మర్యాద పూర్వకంగా సీఎంతో సమావేశం కానున్నారు. ఈ నెల 10వ తేదీన తొలి కేబినెట్ సమావేశం జరగనుంది.