ఆ కేంద్ర మంత్రులకు సీఎం జగన్..సాయిరెడ్డి షాక్ : టీడీపీ నేతలు ఊహించలేని.. : అమరావతి పైనా అంతేనా..!!
ఏపీలోనే కాదు..ఢిల్లీ రాజకీయాల్లోనూ లోపల జరిగే వ్యవహారాలు ఎవరికీ అర్దం కావటం లేదు. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పైన కేంద్ర మంత్రుల స్పందన చూసి ఇక్కడి జగన్ వ్యతిరేకు లు సంబడ పడి పోయారు. ఇంకేముంది..కేంద్రంతో పెట్టుకున్న జగన్..ఇక ఆయన పని అవుట్ అని మరిసిపోయారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పైన కేంద్ర మంత్రులు సైతం అభ్యంతరం వ్యక్తం చేసారు. లేఖ ద్వారా ఇంధన శాఖ మంత్రి..లోక్ సభలో ఇరిగేషన్ మంత్రి షెకావత్ ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను తప్పు బట్టారు. ఇక, ఏపీ నుండి టీీపీ రాజ్యసభ సభ్యులుగా ఉంటూ బీజేపీలో చేరిన ఎంపీలకు తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో నిద్ర పట్టకుండా చేసారు.
ఇక, ఏపీ బీజేపీ నేతలు వరుస పెట్టి జగన్ నిర్ణయాలను తుగ్లక్ చర్యలంటూ ఆరోపించారు. అయితే, వీరందరికీ ముఖ్యమంత్రి జగన్..రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ఊహించని సమాధానం ఇచ్చారు. ఒక రకంగా షాక్ ఇచ్చారు. దీంతో..ఇక, ఇప్పుడు రాజధాని విషయంలోనూ జగన్ అదే విధంగా చేస్తున్నారా అనే సందేహం..చర్చ మొదలైంది. ఇంతకీ జగన్ ..సాయిరెడ్డి ఏం చేసారు.. ఏం జరుగుతోంది..
జగన్ పక్కా వ్యూహాత్మకంగా అడుగులు..
ముఖ్యమంత్రి జగన్ మొండిగానే కాదు..వ్యూహాత్మకంగానూ వ్యవహరించారు. ఏపీలో వరుస పెట్టి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం.. పరిశ్రమల్లో స్థానికుల కు 75 శాతం రిజర్వేషన్లు.. పోలవరం పనుల నిలుపుదల..నవయుగకు కాంట్రాక్టు రద్దు..రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ ..ఇలా కొద్ది కాలంగా జగన్ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం వివాదాస్పద మైంది. అది ఏపీకే పరిమితం కాలేదు. జాతీయ స్థాయి సైతం దాటి అంతర్జాతీయ స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. జపాన్ సంస్థలు ఏకంగా అభ్యంతరాలు చెబుతూ లేఖలు రాసాయి. దీంతో..ఏపీలోని జగన్ వ్యతిరేక రాజకీయ పార్టీలు ఇదే అదనుగా విమర్శలు ఎక్కు పెట్టాయి. కేంద్రం సైతం సీరియస్ గా ఉందనే సంకేతాలను ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇక, ఏపీ బీజేపీ నేతలు సైతం జగన్ లక్ష్యంగా రంగంలోకి దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం జగన్ లో తొందరపాటు మినహా ఏమీ కనిపించటం లేదని వ్యాఖ్యానించారు. మరో బీజేపీ నేత ఆంజనేయ రెడ్డి మరింత తీవ్రంగా స్పందించారు. జగన్ వి తుగ్లక్ నిర్ణయాలుగా అభివర్ణించారు. మరో వైపు టీడీపీ నేతలు తాము బీజేపీకి దూరమై తప్పు చేసామని పార్టీలో చర్చ సాగుతున్న సమయంలో..జగన్ తన నిర్ణయాల ద్వారా ప్రధాని తో అప్రకటిత యుద్దం ప్రకటించారని..కేంద్రం చెప్పినా జగన్ వినటం లేదని..ఇదంతా తమకు కలిసి వచ్చే పరిణామాలుగా చర్చలు చేసారు.
కేంద్ర మంత్రులకు లేని సమాచారం..
ఇక, జగన్ నిర్ణయాల పైన కేంద్ర మంత్రులు సైతం అభ్యంతరం వ్యక్తం చేసారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల మీద ఇంధన శాఖ కార్యదర్శి తొలుత లేఖ రాస్తే దానిని జగన్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదు. అదే సమయంలో కేంద్ర ఇంధన శాఖా మంత్రి సింగ్ నేరుగా ముఖ్యమంత్రికి లేఖ రాసారు. పీపీఏల సమీక్ష నిలుపుదల చేయాలని కోరారు. ఇక, పోలవరం విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాల మీద లోక్ సభ వేదికగా కేంద్ర మంత్రి షెకావత్ ఆందోళన వ్యక్తం చేసారు. పోలవరం ప్రాజెక్టు అధారిటీ సైతం రెండు సార్లు ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాసింది. అయినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. నవయుగ సంస్థకు కాంట్రాక్టు రద్దు చేయటంతో పాటుగా రివర్స్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, వీరిలో ఎవరికీ తాము స్వయంగా ప్రధాని మోదీ..హోం మంత్రి అమిత్ షా అనుమతితోనే నిర్ణయాలు తీసుకుంటున్నామనే విషయం చెప్పలేదు. మంత్రులతో..పీపీఏతో ఆ విషయం పంచుకోలేదు. కనీసం పీపీఏ లేఖలను పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు తాజాగా వైసీపీ ముఖ్యనేత విజయ సాయి రెడ్డి కీలక విషయాన్ని బయట పెట్టారు. తాము తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం ప్రధాని మోదీ..అమిత్ షా ఆమోదంతోనే చేసామని స్పష్టం చేసారు. దీంతో..ఒక్క సారిగా జగన్ నిర్ణయాలను తప్పు బట్టిన కేంద్ర మంత్రులు.. ఏపీ బీజేపీ నేతలు..ప్రధానంగా టీడీపీ నేతలకు..టీడీపీ నుండి బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ షాక్. ఊహించని ఈ పరిణామంతో వారు చర్చల్లో మునిగిపోయారు.
రాజధాని పైనా చెప్పేసారా..
పీపీఏలతో పాటుగా పోలవరం విషయాలే కాదు..బందరు పోర్టు కాంట్రాక్టు..అదే విధంగా కడప స్టీల్ ప్లాంట్ టెండర్ రద్దు పైన ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఇప్పుడు ఏపీ మొత్తంగా చర్చనీయాంశంగా మారిన అమరావతి విషయంలోనూ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. అందులో భాగంగా..ఇన్ని విషయాలు ప్రధాని.. అమిత్ షాతో చర్చించి వేగంగా అడుగులు వేస్తున్న జగన్ ఎక్కడా తప పై వస్తున్న విమర్శలకు మాత్రం సమాధానం చెప్పటం లేదు. ఇప్పుడు కేంద్ర సాయం అందిస్తేనే రాజధాని నిర్మాణం అనే విషయం ప్రభుత్వం అధికారికంగా చెప్పక పోయినా..వాస్తవం. దీంతో..కేంద్రానికి అమరావతి పైన ఉన్న పరిస్థితిని నివేదించి..అక్కడ జరిగిన అవినీతిని వారికి జగన్ వివరించారని విజయ సాయి రెడ్డి స్పష్టం చేసారు. దీంతో..విదేశీ పర్యటన నుండి రాగానే జగన్ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.