నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్.. అమిత్ షాను కలవనున్న జగన్ .. ఎందుకంటే !!
ఏపీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలుసుకోనున్నారు . నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్తున్నారు. ఉదయం 7.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి దేశ రాజధానికి చేరుకుంటారు. 11 గంటలకు కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి ఏపీ సీఎం జగన్ హాజరవుతారు.సాయంత్రం వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. తిరిగి మంగళవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరుతారు జగన్ . మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లిలోని నివాసం చేరుకుంటారు.
పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ పై కేంద్రం సీరియస్ గా ఉన్న సమయంలో జగన్ ఢిల్లీ పర్యటన
ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ పై కేంద్రం సీరియస్ గా ఉన్న నేపధ్యంలో ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు. దీంతో ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది. ఢిల్లీలో జరిగే అంతరాష్ట్ర మండలి సమావేశంలో జగన్ పాల్గొననున్నారు . ఈ సమావేశం తర్వాత జగన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రివర్స్ టెండర్లు, పీపీఏల విషయమై జగన్ ఈ సందర్భంగా అమిత్ షాతో చర్చించే అవకాశం ఉందని సమాచారం .
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ల పై 18 పేజీల నివేదిక.. కేంద్ర నిర్ణయం ఏమిటో ?
పోలవరం ప్రాజెక్టు పవర్ ప్రాజెక్ట్ , హెడ్ వర్క్స్కు సంబంధించి ఈ నెల 17న ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండర్లను ఆహ్వానించింది. అయితే రివర్స్ టెండర్లపై నవయుగ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది . ఇక దీనిని విచారించిన హై కోర్టు రివర్స్ టెండర్లపై ముందుకు వెళ్లకూడదని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక పోలవరం రివర్స్ టెండర్లు వద్దు అని పీపీఏ చెప్పినా వినకుండా పీపీఏ ఆదేశాలు బేఖాతరు చేస్తూ పోలవరం రివర్స్ టెండర్లను పిలవటంతో కేంద్రం దీనిపై సీరియస్ అయ్యింది. రివర్స్ టెండర్ల విషయంలోపూర్తి నివేదిక ఇవ్వాలని పీపీఏను ఆదేశించింది. దీంతో పీపీఏ సీఈఓ జైన్ నుండి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నివేదికను తెప్పించుకొంది.పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ల పై 18 పేజీల నివేదికను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఈ నెల 23వ తేదీన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు అందించింది .ఈ విషయమై నిర్ణయం తీసుకొనేముందు అమిత్ షా, ప్రధానితో జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చర్చించే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి
ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా పర్యటన నుండి ఏపీకి తిరిగి వచ్చిన జగన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.రివర్స్ టెండరింగ్ విషయమై న్యాయ నిపుణులతో కూడ ఏపీ సర్కార్ చర్చిస్తున్నట్టు సమాచారం. ఇక పీపీఏల రద్దు, పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ లపై ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు చెప్పిన మీదటే జగన్ నిర్ణయం తీసుకొన్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.ఇక ఈ నేపధ్యంలో తాజా జగన్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.